గుండెపోటుతో మరో వ్యక్తి ప్రాణం పోయింది. హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో ఓ అమ్మ గుండె ఆగింది. దీంతో ఆమె పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
భారత్లో ఈమధ్య గుండెపోటు ఘటనలు పెరిగాయి. దేశంలోని చాలా చోట్ల సైలెంట్ హార్ట్ ఎటాక్స్తో ఎంతో మంది చనిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనల్ని చూస్తున్నాం. కబడ్డీ ఆడుతూ ఓ యువకుడు, పాఠాలు చెబుతూ ఓ టీచర్ గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. సడన్, సైలెంట్ హార్ట్ ఎటాక్స్తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మరో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు.
పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో.. అన్నీ తానై కుటుంబాన్ని నడిపిస్తోన్న ఓ మహిళ గుండె ఆగింది. దీంతో ఆ పసివాళ్లు దిక్కులేని వారయ్యారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, అంతారంలో చోటుచేసుకుంది. అంతారానికి చెందిన సిరిగిరి జంగమ్మ (33) అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త అంజయ్య ఐదేళ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తల్లీతండ్రి అన్నీ తానై కూలీ చేసి పిల్లల్ని ఆమె పోషిస్తోంది. అలాంటి జంగమ్మ బుధవారం హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె పిల్లలు ప్రశాంత్ (10), లక్ష్మీ (8), శివ (6) అనాథలయ్యారు. ఉండేందుకు ఇల్లు లేక దీనస్థితిలో ఆ పిల్లలు పూరి గుడిసెలో తల్లి శవం దగ్గర ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది.