ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. తెలంగాణలో ప్రతి ఇంట్లో వాడే కరెంటుపై 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి రూపాయి చొప్పున అదనంగా ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదలను రాష్ట్ర విద్యుత్ మండలి ఛైర్మన్ శ్రీరంగారావుకు డిస్కం సీఎండీలు అందజేశారు.
నెలకు 200 యూనిట్లు వాడే ఇళ్లకు అదనంగా నెలకు రూ.100 వరకూ భారం పడనుంది. అంతకు మించి వాడే వారికి మరింత ఎక్కువ ఉంటుంది. రాష్ర్టంలో 1.10 కోట్ల గృహ కనెక్షన్లలో అందరికీ ఒకే స్థాయిలో యూనిట్ కు 50 పైసల చొప్పున పెంపును.. ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. ఒక నెల కరెంటు బిల్లులో ఎన్ని యూనిట్ల కరెంటు వినియోగించారనే దానిని బట్టి సదరు కనెక్షన్ ఏ విభాగంలోకి వస్తుందనేది కంప్యూటర్ నిర్ణయించి బిల్లు వేస్తుంది.
విద్యుత్ చట్టం ప్రకారం కరెంటు ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ పాత్ర నేరుగా ఉండదు. ఆదాయ, వ్యయాల లెక్కలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2022-23కి ‘వార్షిక ఆదాయ అవసరాల’ నివేదికతో పాటు, ఛార్జీల సవరణ ప్రతిపాదనలను నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్ సీకి ఇవ్వాలని విద్యుత్ చట్టం చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగా ఛార్జీలు పెంచాల వద్దా అనేది ఈఆర్ సీ నిర్ణయించి మార్చి 31లోగా తుది తీర్పు చెబుతుంది.
కొందరికి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు రాయితీలు కల్పిస్తుంది. వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకూ ఉచితం. అదే విధంగా క్షౌరశాలలకు 250 యూనిట్ల వరకూ పూర్తిగా ఉచితంగా కరెంటు సరఫరా కొనసాగుతోంది. పవర్ లూమ్ లు, కోళ్లఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్ ఛార్జీలో రూ.2 రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి అని వస్తోన్న సమాచారంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.