తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు శుభవార్త చెప్పగా.. బీడీ టేకేదార్లకు గుడ్ న్యూస్ అందించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఎన్నో వినూత్న పథకాలతో ముందుకు సాగుతున్నారు. పలు అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. ఈ మద్యనే బిసీ, మైనార్టీలకు లక్షరూపాయల పథకాన్ని అమలు పరిచారు.. అంతేకాదు మొన్నటి వరకు బీడీ కార్మికులు మాత్రమే ఆసరా పెన్షన్ లభించింది.. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో బీడీ టేకేదార్లకు సైతం ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దివ్యాంగులకు మరో శుభవార్త తెలిపింది తెలంగాణ సర్కార్. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ అందజేయాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా దివ్యాంగులకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల సొంత స్థలం ఉండి.. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్లకోసం రూ.3 లక్షలు అందించేందుకు తెలంగాణ సర్కార్ ‘గృహలక్ష్మి’ పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు గల నెల నుంచి ఆసరా పింఛన్ రూ.4016 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పెంచిన పింఛన్ ఆగస్టు నెల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. గృహలక్ష్మి పథకం కింద లబ్దిదారులకు రూ.3 లక్షలు ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ మేరకు బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించింది. ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఇదిలా ఉంటే అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్ కి కార్పోరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.