తెలంగాణలో మజ్లిస్ కీలక నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అన్నదమ్ములు. తాజాగా నాంపల్లి కోర్టు తీర్పు అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊరట లభించింది. ఒక బహిరంగ సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై నమోదైన కేసులను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం నాడు కీలక తీర్పు చెప్పింది. 10 సంవత్సరాల క్రితం నిర్మల్ లో ఒక బహిరంగ సభలో ఆయన హిందూ దేవతలను కించ పరిచే విధంగా మాట్లాడినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద సుమోటోగా పోలీసులు కేసులు పెట్టారు. ఆ కేసులో ఆయన నలభై రోజులు శిక్ష కూడా అనుభవించారు.
అప్పటి నుంచి ఈ కేసు పై విచారణ కొనసాగుతూ వస్తుంది. ఇటీవలే ఈ కేసు విచారణను ముగించిన కోర్టు ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి అక్బరుద్దీన్పై ఉన్న రెండు కేసులను కోర్టు కొట్టి వేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. అయితే ఈ తీర్పుని ఏదో విజయం సాధించినంత గొప్పగా అనుకోవద్దని.. కేసు కొట్టి వేసిన సందర్భంగా సంబరాలు లాంటివి చేసుకోవద్దని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.