ఇటీవల కొంత మంది చనిపోతూ తమ అవయవదానాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాము మరణించినా కూడా వారిలో బతికే ఉంటున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను కన్నుమూసినా.. ఐదుగురు కుటుంబాల కళ్లల్లో వెలుగులు నింపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ తాను చనిపోతూ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నా బత్తుల విజయ్ కుమార్ ఇటీవల తన బైక్ పై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విజయ్ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని డాక్టర్లు సూచించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం మలక్ పేటలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న తమ కొడుకు అకాల మరణం వారిని కృంగదీసింది. అంత బాధలో ఉన్నాకూడా ఆ కుటుంబం ఓ గొప్ప పనిచేయడానికి పూనుకున్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.
విజయ్ కుమార్ కి సంబంధించి ముఖ్య భాగాలు తీసుకొని అపోలో ఆస్పత్రికి పంపించారు. తాము సేకరించిన గుండెను బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య గ్రీన్ ఛానెల్ ద్వారా మలక్ పేట యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్కు తరలించారు. తాము సేకరించిన అవయవాలు ఇతర పేషెంట్లకు అమర్చినట్లు వైద్యులు తెలిపారు.
బ్రెయిన్ డెడ్ అయిన విజయ్ కుమార్ చనిపోయి కూడా తన అవయవాల దానంతో చిరంజీవిగా ఉంటారని వైద్యులు అంటున్నారు. ఆయన వల్ల ఐదు కుటుంబాల్లో వెలుగు నిండిందని సహచర ఉద్యోగులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.