ఇంటి వరండాలోని ఊయలలో నిద్రపోతున్న చిన్నారి దగ్గరకు కోతులు వచ్చాయి. వాటికి ఏమనిపించిందో ఏమో.. చిన్నారి మీద దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలును కొరికేశాయి. చిన్నారి అరుపులు విన్న తల్లి అక్కడికి రావటంతో..
చిన్నారుల మీద జంతువుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ అంబర్ పేటలోని ఎరుకల బస్తీకి చెందిన 4 ఏళ్ల ప్రదీప్పై వీధి కుక్కలు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. తండ్రి గంగాధర్ వాచ్మెన్గా పని చేస్తున్న చోటు దగ్గరకు వెళ్లటంతో కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ సంఘటన మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఇద్దరు పిల్లలు కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ రెండు ఘటనలు మరువక ముందే మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కోతులు చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో పాప కాలి బొటన వేలు తెగిపోయింది. ఇంటి వరండాలోకి చొరబడి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి. ఈ సంఘటన మహబూబాబాద్లో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలోని మోదుగులగూడెం గ్రామానికి చెందిన ఓ తల్లి తన బిడ్డను ఇంట్లో ఉన్న వరండాలోని ఊయలలో పడుకోబెట్టింది. కొద్దిసేపటి తర్వాత నీళ్ల కోసం వరండాలోనుంచి ఇంట్లోకి వెళ్లింది. ఆమె అటు వెళ్లగానే కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఊయలలో పడుకున్న చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి కుడికాలి బొటన వేలును కొరికేశాయి. దీంతో చిన్నారి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. చిన్నారి ఏడుపు వినపడటంతో తల్లి వరండాలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కోతులు తన బిడ్డపై దాడి చేయటం చూసి షాక్ అయింది.
ఆ వెంటనే వాటిని తరిమి కొట్టింది. కోతుల దాడితో చిన్నారి కుడి కాలి బొటన వేలు తెగిపోయింది. తల్లిదండ్రులు చిన్నారిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, మనుషుల మీద జంతువులు దాడి చేయటం కొత్తేమీ కాదు.. గతంలో ఇంటి వరండాలో నిద్రపోతున్న ఓ వృద్ధురాలిపై పందులు దాడి చేశాయి. విచక్షణా రహితంగా ఆమెను కొరికేశాయి. పందుల దాడిలో గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి, ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.