కుటుంబ వ్యాపారంలో అడుగు పెట్టాలని అనుకోలేదు. కానీ తండ్రి చనిపోవడంతో కంపెనీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఆ వ్యాపారం గురించి అవగాహన లేకపోయినా గానీ ఆమె అందులో కూడా రాణించి విజయం సాధించారు. ఆమె మంచు లక్ష్మి స్నేహితురాలు.
మంచు లక్ష్మి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత పరిచయమైన మొట్టమొదటి స్నేహితురాలు మహిమా దాట్ల. మహిమా దాట్ల హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త. ఫార్మా దిగ్గజ కంపెనీ బయోలాజికల్-ఈ లిమిటెడ్ కి ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు మహిమా దాట్ల. ఈమె కుటుంబం నుంచి ఈమె మూడవ తరం వ్యాపారవేత్త. ఈమె కుటుంబం 1948లో ఫార్మా కంపెనీని స్థాపించింది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే హెపారిన్ ఔషధాన్ని భారత్ కు తీసుకొచ్చింది వీరి కుటుంబమే. ఇంత ప్రతిష్ట కలిగిన బయోలాజికల్-ఈ కంపెనీకి హెడ్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు మహిమా దాట్ల. లండన్ లో వెబ్ స్టర్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిమా దాట్లకు కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టాలన్న ఆసక్తి లేదు.
కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆమె 2001లో కంపెనీలో కీలక పాత్ర పోషించారు. 2013లో తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో కంపెనీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఈమె ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ కంపెనీ వందకు పైగా దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేస్తోంది. గత దశాబ్ద కాలంలో 200 కోట్లకు పైగా డోస్ లను అందించింది. మహిమా దాట్ల నాయకత్వంలో బయోలాజికల్-ఈ సంస్థ కరోనా మహమ్మారి సమయంలో కోర్బ్ వ్యాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి వార్తల్లో నిలిచింది. బయోలాజికల్-ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫై చేసిన 7 వ్యాక్సిన్లు ఉన్నాయి. ఈ 7 వ్యాక్సిన్లు మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధులను నయం చేస్తాయి.
అంతర్జాతీయంగా టెటానస్ వ్యాక్సిన్ ని తయారు చేసే అతి పెద్ద సంస్థగా బయోలాజికల్-ఈ కంపెనీ ఉంది. 2022లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8700 కోట్లుగా ఉండడంతో ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో ఆమె నెట్ వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా రూ. 2022లో ఆమె సంపద విలువ రూ. 1000 కోట్లు పెరిగింది. కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టాలన్నా ఆసక్తి లేకపోయినా గానీ కంపెనీ బాధ్యతలు చేపట్టి కంపెనీని మరింత పైకి తీసుకొచ్చారు.