టీఎస్ ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) నష్టాల కూపంగా మారుతుంది. ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 4 నెలలు చూసి ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని కేసీఆర్ హెచ్చరించినట్లు ఆర్టీసీ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నూతన చైర్మన్గా బాధ్యత స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ రివ్యూలో పాల్గొన్నారు. ఈ సమావేశం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.
మరో నాలుగు నెలల్లో ఆర్టీసీ నష్టాల నుంచి కోలుకుని గాడిలో పడకుంటే ప్రైవేటు పరం చేసేస్తామని సీఎం కేసీఆర్ అన్నారని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి సీఎం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, ఆయన అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారని చెప్పారు. లాభాలు తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని, నష్టాలోస్తే కార్మికులు, అధికారులు అందరూ రోడ్డున పడతారని కొత్త చైర్మన్ బాజిరెడ్డి హెచ్చరించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు, అధికారులు సమర్థంగా పనిచేసుకోవాలని కోరారు.