మద్యానికి బానిసైన కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుని కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ రోజుల్లో చాలా మందికి జీవితానికి ఉన్న విలువ ఏంటో తెలియడం లేదు. ప్రతిదానికి ప్రాణాలు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. చెప్పడానికి కాస్త కటువుగా ఉన్నా ఇటీవల కాలంలో సూసైడ్లు పెరిగిపోయాయి. జీవితాన్ని ఎలా మలచుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టయిల్ను అలవాటు చేసుకోవాలి, కష్టనష్టాలను ఎదుర్కొని ఎలా ఎదగాలనే ఆలోచన చాలా మందిలో ఉండట్లేదు. చిన్న కష్టం వచ్చినా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎవరో తిట్టారనో, ఉద్యోగం రాలేదనో, మార్కులు తక్కువగా వచ్చాయనో, ఫ్యామిలీ గొడవల వల్లో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. కన్నవాళ్లు, కుటుంబం, స్నేహితులను వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. అలాంటి ఓ ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ప్రాణాలు తీసుకున్నాడో భర్త. ఈ ఘటన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో జరిగింది.
వనపర్తి జిల్లా, రేవల్లి మండలం తలుపునూరుకు చెందిన కొరమోని స్వామి (45) భార్య, పిల్లలతో కలసి జూబ్లీహిల్స్లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్లుగా మద్యానికి అలవాటుపడిన స్వామి.. శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం మళ్లీ మద్యం కొనేందుకు డబ్బులు కావాలంటూ భార్య రాణిని రూ.100 అడిగాడు. ఆమె ఇవ్వనని కరాఖండీగా చెప్పేసింది. దీంతో గొడవకు దిగడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత లోపల గడియ వేసుకున్న స్వామి, చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత భార్య తలుపులు తట్టినా తీయలేదు. స్థానికుల సాయంతో తలుపులు తొలగించి చూడగా.. ఫ్యాన్కు వేలాడుతూ అచేతనంగా కనిపించాడు స్వామి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది.. అతడ్ని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.