ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే ‘ప్రజావాణి’. అలాంటి ఓ ప్రోగ్రామ్లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదుకు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..!
మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇక, మద్యం ప్రియుల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. కొందరైతే బ్రాండ్ల విషయంలో అస్సలు రాజీపడరు. తమకు ఈ బ్రాండ్ అయితేనే తాగుతామని పట్టుబడతారు. ఇది మరోసారి రుజువైంది. తమకు ఇష్టమైన మద్యం బ్రాండ్ అందుబాటులో లేదని ఏకంగా కలెక్టర్నే ఆశ్రయించాడో వ్యక్తి. తనకు నచ్చిన బ్రాండ్ మద్యం లేనప్పుడు ఎందుకు సర్దుకుపోవాలని అనుకున్నాడో ఏమో కలెక్టర్కే ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.
జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి తమ గ్రామంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ వింత సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. తాను బాగా ఇష్టపడే బీర్ బ్రాండ్ కింగ్ఫిషర్ అందుబాటులో లేదని కలెక్టర్కు కంప్లయింట్ చేశాడు. ప్రజావాణిలో తమకు కింగ్ఫిషర్ బ్రాండ్ బీర్లు దొరకడం లేదని చెప్పాడు. జగిత్యాలలోని వైన్స్ షాపులు సిండికేట్ అయి కింగ్ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ కలెక్టర్ బీఎస్ లతకు ఫిర్యాదు చేశాడు. కాగా, గతంలో కూడా జగిత్యాలలో ఇదే తరహా ఘటన జరిగింది. జగిత్యాలలో 2018లో అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కింగ్ఫిషర్ బీరు దొరకడం లేదని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు కంప్లయింట్ చేశాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.