అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నాం.. భూగోళం ఆవల ఏమున్నాయో పరిశోధిస్తున్నాం.. వైద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నాం. నాగరిక సమాజంలో బతుకుతున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సమజాంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. మరో 100 ఏళ్లు గడిచినా.. మూఢనమ్మాకాలు, నకిలీ బాబాల వంటివి మాత్రం మాసిపోవని అనిపిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. నేటి కంప్యూటర్ కాలంలో కూడా చేతబడులు, క్షుద్ర పూజలు వంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూడటంతో.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వివరాలు..
హైదారబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలు.. బాబా కలలో చెప్పాడని నమ్మి.. ఇంట్లోనే సమాధి నిర్మించి.. పూజలు చేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన వృద్దురాలికి ఒక రోజు కలలో ఓ బాబా కనిపించాడట. మన వంశం గత 600 ఏళ్లుగా భూమిలోనే ఉంది. ఇప్పుడు పైకి రావాలని భావిస్తోంది. అందుకే నువ్వు ఓ సమాధి నిర్మిస్తే.. దాన్నుంచి బయటకు వస్తామని చెప్పాడట. దాంతో వృద్ధురాలు కలలో బాబా చెప్పిన మాటలు నిజమని నమ్మడమే కాక.. తనకు వచ్చిన కల గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. దాంతో ఇంట్లోని వారందరూ కలిసి బాబా కోసం ఓ సమాధి నిర్మించారు.
అంతేకాక.. కుటుంబ సభ్యులంతా కలిసి.. ఇంట్లోని ఆ సమాధికి రోజూ పూజలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి.. చుట్టుపక్కల ఉంటున్న కొందరు స్థానికులు కూడా వృద్ధురాలి ఇంటికి వచ్చి సమాధికి పూజలు చేస్తోన్నారు. ఈ క్రమంలో వృద్ధురాలి ఇంట్లో నుంచి రోజూ వింత శబ్దాలు రావడంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీని గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. వృద్ధురాలి కుటుంబసభ్యుల నుంచి వివరాలు తెలుసుకుని సమాధిని కూల్చేశారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక వృద్ధురాలి ఇంట్లో నుంచి వింత శబ్ధాల వచ్చేవని.. కుటుంబ సభ్యులంతా సమాధికి పూజలు చేస్తూ.. వింతగా ప్రవర్తించేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ వీధిలోకి వెళ్లాలంటేనే చాలామందికి భయం వేసేదని.. ఆ ఇంటి ముందు నుంచి వెళ్లాలంటే భయపడేవారని స్థానికులు అంటున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు వృద్ధురాలి ఇంటి వద్దకు చేరుకుని.. సమాధిని కూల్చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి పనులు చేయవద్దని, మూఢ నమ్మకాలను ప్రోత్సహించేది లేదని పోలీసులు హెచ్చరించి పంపించారు. మన సమాజం నుంచి మూఢనమ్మాకాలు పూర్తిగా తొలగిపోవాలంటే.. ఇంకెంత కాలం పడుతుందని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.