కన్నబిడ్డను కడుపులో పెట్టి చూసుకున్నారు.. అల్లారుముద్దుగా పెంచారు. బిడ్డను బాగా చదివించి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలని ఎన్నో కలలు కన్నారు. నిత్యం బిడ్డ భవిష్యత్తు గురించే ఆలోచించేవారు. పైచదువులు ఎక్కడ చదివించాలి.. తన ఫ్యూచర్కు ఏ కోర్స్ బాగుంటుంది వంటి అంశాల గురించి చర్చించుకునేవారు. ఈ ఏడాది పదో తరగతి.. చదువుతోంది. తర్వాత ఏం చేయాలి అని నిత్యం బిడ్డ బాగోగుల గురించే ఆలోచించే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలే విషాదం చోటు చేసుకుంది. జీవితాంతం ఏడ్చినా వారి బాధ తీరదు. అయితే గుండెలు తరక్కుపోయే విషాదంలో కూడా ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. శభాష్.. బిడ్డ జీవితానికి సార్థకత చేకూర్చారు అని ప్రశంసిస్తున్నారు. అసలు ఇంతకు వారి బిడ్డకు ఏం జరిగింది.. ఆ తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే..
హైదరాబాద్ మణికొండ పరిధిలోని నెక్కంపూర్కు చెందిన బుస చంద్రశేఖర్, రాగ దంపతుల కుమార్తె స్వరీన. ప్రస్తుతం ఆ అమ్మాయి ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో.. పది రోజుల క్రితం అనగా.. ఈనెల 15న వాళ్లు నివాసం ఉంటున్న భవనం నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది స్వరీన. ఈ ఘటనలో చిన్నారి.. తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో.. వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి.. అత్యవసర చికిత్స అందించారు. అయినా లాభం లేకుండా పోయింది.
దాదాపు నాలుగు రోజుల పాటు.. మృత్యువుతో పోరాడిన స్వరీన.. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. బిడ్డ పరిస్థితి చూసి.. ఆ తల్లిదండ్రులు.. గుండెలు పగిలేలా ఏడ్చారు. చిన్నప్పటి నుంచి చదువు, కల్చరల్ యాక్టీవీస్లో ఎంతో చురుగ్గా ఉండే.. బిడ్డ.. ఇలా జీవచ్ఛవంగా మారడాన్ని.. ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తమకెందుకు ఇంత కడుపుకోత అని ఏడ్చారు. ఇక స్వరీన బ్రెయిన్ డెడ్ విషయం తెలుసుకున్న జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిశారు. అవయవదానం గురించి వారికి అవగాహన కల్పించారు.
కుమార్తె పరిస్థితి చూసి.. తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులు.. అవయవదానం అవశ్యకతను తెలుసుకుని.. అందుకు అంగీకరించారు. దీని గురించి వైద్యులకు చెప్పడంతో.. వారు స్వరీన 2 కిడ్నీలు, కాలేయం, రెండు లంగ్స్ను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయా అవయవాల వైఫల్యంతో.. చికిత్స పొందుతున్న రోగులకు స్వరీన అవయవాలు అమర్చారు. తమ ఇంటి దీపం ఆరిపోయిందన్న బాధను దిగమింగుకుని.. మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆ తల్లిదండ్రుల మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక చదువు, ఆటపాటల్లో ఎంతో చురుగ్గా ఉండే స్వరీన పెద్దయ్యాక ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలని కలలు కనేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. వైద్య వృత్తిలోకి వెళ్లి ఎంతో మంది ప్రాణాలు కాపాడాలని ఆశ పడిందట. కానీ విధి.. ఆ చిన్నారి కలలు చిదిమేసింది. అయితే ప్రమాదంలో గాయపడి.. మృతి చెందినప్పటికి.. తన అవయావాలు దానం చేసి.. మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చింది. తాము చేసిన పనితో.. బిడ్డ ఆత్మ శాంతిస్తుంది అంటున్నారు స్వరీన తల్లిదండ్రులు. పుట్టెడు దుఖంలోనూ.. ఇతరుల గురించి ఆలోచించిన స్వరీన తల్లిదండ్రుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.