హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను నార్కోటిక్ వింగ్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలిస్తున్నారు. ఎన్ఎండీఏ, ఎల్ఏఎస్డీ తో పాటు.. హాష్ఆయిల్, గంజాయి సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్, కార్కానా, సికింద్రాబాద్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పట్టుబడ్డ వారిలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజీలలో జోరుగా మత్తు ముందు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. డార్క్ నైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు విద్యార్థులు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేశామన్నారు.
అరెస్టైన వారిలో ప్రతిభ, అవినాష్ డిగ్రీ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.. కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా అరెస్టైన వారిలో ఉన్నట్లు సమాచారం. వీరు సాఫ్ట్ వేర్ కంపెనీలో కీలక పోస్టులలో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులను ఇది వరకు మానవీయ కోణంలో కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టామన్నారు. అయినా వారిలో మార్పు రాలేదని.. అందుకే విద్యార్థులను కూడా అరెస్టు చేస్తున్నామని సీవీ ఆనంద్ వివరించారు. నిందితుల్లో యువతులు కూడా ఉన్నారని తెలిపారు. డార్క్ నెట్ ద్వారా డగ్స్ తెప్పించుకుంటూ పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని సీపీ చెప్పారు.