గత నాలుగైదు రోజులుగా అటు దేశవ్యాప్తంగా.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ఉద్యోగం నిమిత్తమో.. లేక తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్తే.. వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు ఇంట్లో వాళ్లకు ఆందోళన తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీడియా సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ప్రజలకు చేరవేసే బాధ్యత వారి మీద ఉంటుంది. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలను కవర్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ ఒకరు గల్లంతయ్యారు. ఆ వివరాలు..
భారీ వర్షాలు, వరదలను కవర్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గల్లంతయ్యారు. జగిత్యాల రిపోర్టర్గా పని చేస్తున్న జమీర్ కారులో రిపోర్టింగ్కు బయల్దేరారు. అయితే భారీ వరదల నేపథ్యంలో కారు వరదలో చిక్కుకుంది. ఆ తర్వాత వరద ప్రవాహం మరింత పెరగడంతో కారు కొట్టుకుపోయింది. కుర్రులో (నదిలో ఒక లంక లాంటి ప్రాంతం) చిక్కుకుపోయిన వ్యవసాయ కార్మికుల రెస్క్యూ ఆపరేషష్ను కవర్ చేసి వస్తున్న క్రమంలో ఆయన గల్లంతయ్యారు. మరోవైపు జమీర్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే, ఆ కారులో ఉన్న మరో వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. జమీర్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అతని పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్త చేస్తున్నారు. సహోద్యోగులు జమీర్ క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.