Girl: ప్రేమగా పెంచాల్సిన తల్లి దూరమైంది.. అండగా నిలిచి నడకలు నేర్పాల్సిన నాన్న మందు మత్తులో జోగుతున్నాడు. పసి పాప ఏడుస్తోంది.. అమ్మకోసం,నాన్న కోసం కాదు.. ఆకలి రూపంలో కడుపులో పుట్టిన మంటలకు. ఆ ఇంట్లో ఎవరూ లేరు.. బడికెళ్లి చదువుకోవాల్సిన 8 ఏళ్ల అక్క తప్ప. అక్కకు అర్థమైంది. తన చెల్లెలు ఆకలి బాధతో పాలకోసం ఎడుస్తోంది. తానేం చేయగలదు పాపం. పాలిచ్చే తల్లిలేదు.. పాలించే తండ్రి లేడు.. పాలు కొనడానికి చేతిలో చిల్లిగవ్వకూడా లేదు. చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాలు… చెల్లెలు ఏడుస్తుంటే అల్లాడిపోయింది. పసి బిడ్డను చంకనేసుకుని రోడ్డుపైకి వచ్చింది. ‘నా చెల్లెలు ఆకలితో ఏడుస్తోంది.. దయచేసి పాలు కొనివ్వండి’ అంటూ దారిన పోయే వాళ్లను ధీనంగా అడుక్కోవటం మొదలెట్టింది.
ఓ బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే చలించే మనసు ఓ తల్లికి మాత్రమే ఉంటుంది. అలా ఆ పసిపాప ఏడుస్తుంటే ఓ యాచకురాలు చలించిపోయింది. తాను తిన్నా తినకున్నా పర్లేదు.. ఓ బిడ్డ కడుపు నింపాలి అనుకుంది. తల్లిగా మారి బిడ్డకు పాలిచ్చింది. ఓ రెండు చిన్న ప్రాణాలకు ఊరట నిచ్చింది. ఇంతకీ సంగతేంటంటే.. మహబూబ్నగర్ జిల్లా సదాశివపేటకు చెందిన 8 ఏళ్ల సురేఖ కుటుంబంతో కలిసి చెరువు పక్క ఉండే గుడిసెలో నివాసం ఉంటోంది. తాగుడుకు బానిసైన తండ్రి వేధింపుల కారణంగా తల్లి రెండు రోజుల క్రితం ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం నెలల చెల్లెలు ఆకలితో పాల కోసం ఏడవ సాగింది. పాలివ్వటానికి తల్లిలేదు.. పాలు కొనటానికి డబ్బులు లేవు. మరి, చెల్లెలు ఆకలి తీర్చటం ఎలా అని మధనపడింది.
ఓ ఆలోచన తట్టింది. వెంటనే చెల్లెల్ని చంకలో వేసుకుని రోడ్డుపైకి వచ్చింది. ‘మా చెల్లెలు ఆకలితో ఏడుస్తోంది.. పాలు కావాలి.. కొంచెం సాయం చేయండయ్యా..’ అంటూ దారిన పోయే వారిని అడుక్కోవటం మొదలుపెట్టింది. చెల్లిల్ని చంకలో వేసుకుని పాల కోసం అడుక్కుంటున్న సురేఖను చూసి ఎల్లమ్మ అనే యాచకురాలు చలించిపోయింది. తానూ ఓ బిడ్డకు తల్లినేనన్న ఆలోచనతో బిడ్డను అక్కన చేర్చుకుంది. చెట్టుకిందకు తీసుకెళ్లి బిడ్డకు పాలిచ్చింది. ఓ యాచకురాలు పసిబిడ్డకు తల్లిగా మారి పాలిచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో శిశుసంక్షేమ శాఖ అధికారులు బాలిక ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఐదుగురు పిల్లలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారిని శిశుగృహానికి తీసుకెళ్లారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Mahabubnagar: ఇల్లు కూల్చారు.. బాత్రూమే ఇల్లయ్యింది!