స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. తోడబుట్టినోళ్లు కాదు అయినా సరే జీవితాంతం కష్టాల్లో తోడుంటారు. బంధువులు కాదు, రాబంధులు అంతకంటే కాదు.. కానీ ఏ సంబంధం లేకుండానే బంధువులైపోతారు. ఏదో విడదీయరాని రుణ బంధం స్నేహితులని కలిపి ఉంచుతుంది.
స్నేహం చాలా గొప్పది. స్నేహితుడి సంతోషంలోనే కాదు.. కష్టాల్లో కూడా పాలుపంచుకుంటారు. స్నేహితుడికి కష్టమొస్తుందంటే చాలు.. అందరూ ఒక్కటైపోతారు. ఈ భూమ్మీద ఎటువంటి బంధం, సంబంధం లేకపోయినా గానీ వెతుక్కుంటూ వచ్చేదే స్నేహం. కులం, మతం, ప్రాంతం, వర్గం వంటివి లేకుండా మనిషిని మనిషిగా గుర్తించి ముందుకొచ్చే వాళ్ళే స్నేహితులు. ఫ్రెండ్ సప్లీ ఫీజుల కోసం తన స్కాలర్ షిప్ డబ్బులను త్యాగం చేసే స్నేహితులు, ఫోన్ తాకట్టు పెట్టి మరీ ఫ్రెండ్ పరీక్ష ఫీజు కట్టే స్నేహితులు, ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం వారధిగా నిలబడే స్నేహితులు, ఫ్రెండ్ ని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టే స్నేహితులు.. ఆత్మస్థైర్యం కోల్పోతే ధైర్యం చెప్పే స్నేహితులు, ఓడిపోతే వెన్ను తట్టి ప్రోత్సహించే స్నేహితులు.. ఇలా ప్రతీ దశలోనూ వెన్నంటే నిలిచే స్నేహితులు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటారు. ఫ్రెండ్ కి ఏమైనా ఆపదొస్తే డబ్బులు పోగేసి మరీ ఆర్థిక సాయం చేస్తారు.
ఇది అప్పు కాదురా.. ప్రేమతో ఇస్తున్నాం.. తిరిగి ఇవ్వాల్సిన పని లేదు అని అంటారు. నువ్వు బాగుంటే అదే పదివేలు, లక్ష అంటారు. ఈరోజుల్లో ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఎవరండీ సాయం చేసేది. బంధువులా చేయరు. అప్పుగా ఇస్తారు. వడ్డీ కట్టమంటారు. వడ్డీ కాదు కదా.. అసలు తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు.. ఫ్రెండ్ లైఫ్ బాగుంటే అదే వడ్డీ, ఫ్రెండ్ సక్సెస్ అయితే అదే అసలు అని జమ చేసుకునే స్నేహితులు ఉంటారు. ఇదంతా చెప్పేది ఎందుకంటే.. ఇలాంటి పాత్రలు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఉంటారు. నిజ జీవితంలో ఉండే పాత్రలనే సినిమాల్లో పెడతారు. ఏ స్నేహితులైనా గానీ ఎక్కడైనా గానీ ఒక లక్ష, రెండు లక్షలు సాయం చేస్తారు గానీ 25 లక్షలు సాయం చేస్తారా? అలా సాయం చేయడం మీరు చూశారా?
తమ మిత్రుడు గుండెపోటుతో మరణించాడని ఆయన కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేశారు. 2014వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన దుండిగల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఈ నెల 8న గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన బ్యాచ్ కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీఎస్, ఏపీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ. 25 లక్షలను సేకరించి చెక్ ను హయత్ నగర్ లోని ప్రభాకర్ రెడ్డి నివాసంలో అందజేశారు. ఇందులో రూ. 20 లక్షలను ప్రభాకర్ రెడ్డి మూడేళ్ళ కూతురు అక్షయ రెడ్డి పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. మిగిలిన 5 లక్షలను ప్రభాకర్ రెడ్డి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న, తల్లిదండ్రులు, ఎల్బీ నగర్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న ఆయన సోదరుడు దయాకర్ రెడ్డి, 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు టాటా శ్రీధర్, రామకృష్ణ, శ్రీనివాస్ తో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. మరి చనిపోయిన స్నేహితుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం చేసిన స్నేహితులకి ఒక సెల్యూట్ చేయండి.