హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని.. కేసీఆర్ అహంకారం, డబ్బు, మద్యం సీసాలను తిప్పికొట్టారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ పాల్పడినటువంటి నీచపు రాజకీయాలను తాను ఎన్నడూ చూడలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. దళిత బంధు పెట్టినా ప్రజలను నన్ను గెలిపించారు. ఓటు వేయకపోతే దళిత బంధు నిలిపేస్తామని ప్రభుత్వం బెదిరించింది. పింఛన్లు ఆపేస్తామని వృద్ధులనూ భయపెట్టింది. ఒక దశలో హుజూరాబాద్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారు. ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు. నా హుజూరాబాద్ ప్రజలు నిబద్ధతకు మారుపేరు. నా విజయాన్ని హుజూరాబాద్ ప్రజలకు అంకితం చేస్తున్నాను. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు ఈటెల.
నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు. గుర్తు పెట్టుకోండి.. కుట్రదారుడు కుట్రలకు నాశనమైపోతాడు. కుల సంఘాలు, భవనాలు, గుడులకు డబ్బులు ఇచ్చారు అని చెప్పారు. తన చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదని.. మోసం చేసింది.. వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లగొట్టింది కేసీఆరే అని అన్నారు. ఈటల రాజేందర్ పార్టీలు మారే వ్యక్తి కాదు. టీఆర్ఎస్ నుంచి నన్ను వెళ్లగొట్టారు. నన్ను బీజేపీ దగ్గరకు తీసుకుని చేర్చుకుంది. నేను వెన్ను పోటు పొడిచానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వెళ్లగొడితేనే నేను బయటకు వచ్చాను. వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ అని అన్నారు ఈటల. ఓయూ, కేయూతో పాటు ఎందరో విద్యార్థులు నాకు సహకరించారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కుయుక్తులను చీల్చి చెండాడారు. ప్రపంచంలోని తెలుగు వారంతా కూడా నా గెలుపును కోరుకున్నారు. నిజంగా దీపావళి ఈనెల 4న అయితే నా గెలుపు తో ప్రజలంతా నిన్ననే దీపావళి చేసుకున్నారు. పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం అని అన్నారు ఈటెల రాజేందర్.