Telangana: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. తాను సీఎం కేసీఆర్ ను గద్దె దించేవరకూ నిద్రపోనని, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతేకాదు తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారు. “ఈటల రాజేందర్ మీద దాడి జరిగితే.. అది తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడిగా భావించాలని అన్నారు. గతంలో కూడా తనపై దాడి చేసేందుకు రెక్కీ చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో తనను బెదిరించారని, అయితే తాను భయపడలేదని అన్నారు. తాను చావుకి భయపడే రకం కాదని, ఇలాంటి బెదిరింపులు ఎన్నొచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఇక తాను స్పీకర్ ని మరమనిషి అని సంబోధిస్తే తప్పు అని అంటున్న టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ మాట్లాడే మాటల గురించి ఏం చెబుతారంటూ ప్రశ్నించారు. తిట్లనే తెలంగాణ భాషగా కేసీఆర్ మాట్లాడతారని, దీనికేం సమాధానం చెబుతారంటూ మండిపడ్డారు. తనకు బీఏసి సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో ఈటల రాజేందర్ మాట్లాడే సమయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అలానే స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.
అయితే తాను స్పీకర్ ను అవమానించేలా మాట్లాడలేదని రాజేందర్ అన్నారు. కానీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఆయనను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా ఒక్క ఎమ్మెల్యేకి కూడా బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని అన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావుని అడిగినా స్పీకర్ నుండి స్పష్టత రాలేదని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్ ను మరమనిషి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఈటల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఇబ్బంది కలిగితే దానికి కేసీఆర్ దే బాధ్యత అంటూ వ్యాఖలు చేశారు. మరి కేసీఆర్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఈ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.