హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈమధ్య కొన్ని ప్లేసులు అయితే సెల్ఫీ స్పాట్లుగా కూడా మారాయి. అలాంటి ఓ చోట కొందరు పర్యాటకులు వాహనాలు అడ్డగోలుగా నిలిపివేసి వెళ్తుండటంతో పార్కింగ్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా కొన్ని ప్రదేశాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసింది సర్కారు. వాటిల్లో ఒకటి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. సిటీలో ఐకానిక్ వంతెనగా ఈ కేబుల్ బ్రిడ్జి ప్రసిద్ధి పొందింది. తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగరవాసులే గాక పర్యాటకులు కూడా భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి ఇక్కడ మరింత ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జి మీద చాలామంది తమ స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీంతో హైదరాబాద్లో ప్రధాన సెల్ఫీ స్పాట్గా కేబుల్ బ్రిడ్జి మారిపోయింది. కేబుల్ బ్రిడ్జికి పగటి పూట కంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా సందర్శకులు వస్తుంటారు.
లైటింగ్ బాగుంటుందనే ఉద్దేశంతో రాత్రి పూట సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వెహికిల్ పార్కింగ్ మీద ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు. అయినా కొంతమంది బ్రిడ్జిపై కార్లు లేదా బైకులు పార్కింగ్ చేసి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.ఈ క్రమంలో బ్రిడ్జిపై బండి పార్కింగ్ చేసినవారికి పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వెహికిల్ పార్కింగ్ చేస్తే రూ.200 నుంచి రూ.2 వేల వరకు ఫైన్ వేస్తున్నారు. రాత్రిపూట ప్రత్యేక కెమెరాలతో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. బ్రిడ్జి మీద వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల వంతెన చూసేందుకు వస్తున్న సందర్శకులకు ఇబ్బంది కలుగుతోందని, అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానా విధిస్తున్నట్లు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.