రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం మరింత పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో భద్రాచలంలోని పలు కాలనీలు నీట మునిగాయి.
మూడో ప్రమాద హెచ్చరిక
ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61 అడుగులకు చేరింది. గురువారం రాత్రికి నీటి మట్టం 66 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకంతకు వరదనీరు పోటెత్తడంతో భద్రాచలం నుంచి కూనవరం, చర్ల మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం 5 గంటల నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై కూడా రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నదిలో ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు.
భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
అయితే..భద్రాచలం వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారి. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆంక్షలు అమలులోకి రాగా.. 48 గంటల పాటు కొనసాగనున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: మర్రివాడలో బాహుబలి సీన్.. వీడియో వైరల్