తెలంగాణ రాష్ట్ర సమితి.. కేసీఆర్ సారధ్యంలో ఉద్యమ పార్టీగా మొదలై.., అదే కేసీఆర్ సారధ్యంలో పరిపూర్ణ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన పార్టీ. కానీ.., ఈ ప్రాసెస్ లో ప్రత్యేక రాష్ట్రం కోసం గళం ఎత్తిన ఎందరో నాయకులకి గులాబీ గూటిలో స్థానం లేకుండా పోయింది. ఎన్నడూ ప్రత్యేక వాదాన్ని భుజానికి ఎత్తుకొని వారు మాత్రం ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. సరే.. రాజకీయాల్లో ఈ పోట్లు, వెన్నుపోట్లు మామూలే అనుకున్నా.., కేసీఆర్ కార్ లో నుండి ఈటలని దించేయడంతో యావత్ తెలంగాణ సమాజం విస్తుపోయింది. పోరు సమయంలో కేసీఆర్ ఎంపీగా కేంద్రంలో కొట్లాడితే.., రాష్ట్రంలో ఉద్యమం నీరు కారిపోకుండా చూసింది మాత్రం అక్షరాల ఈటల రాజేందర్ మాత్రమే. అలా కష్టపడ్డారు కాబట్టే.. గులాబీ గూటికి తాను యాజమానిని అని చెప్పుకున్నాడు. సరే.., కుటుంబ రాజకీయాలు నడిచే దక్షణ భారతదేశంలో ఈటల కాస్త అత్యాశే పడ్డారు అనుకుందాం. కానీ.., అంత మాత్రం దానికి కుడి భుజాన్ని దూరం పెట్టాల్సిన అవసరం లేదన్నది కొంతమంది వాదన. కానీ.., ఇక్కడ కేసీఆర్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది.
త్వరలో ముఖ్యమంత్రి పీఠం పైకి కేటీఆర్ ఎక్కడం ఖాయం. ఆ సమయానికి కొత్త అధినేతకి ఎదురు తిరిగి సమాధానం చెప్పే గొంతుకులు పార్టీలో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన. ఇందుకోసమే తనపై ఎవరికైతే అసమ్మతి ఉందొ వారందరిని దూరం పెట్టేయడమే మంచిదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ కేసీఆర్ టార్గెట్ జగదీష్ రెడ్డే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.., ఇందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం హంపిలో జగదీష్ రెడ్డి కుమారుడి బర్త్ డే పార్టీని గ్రాండ్ గా జరిపారు. దానికి కొందరు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, పలువురు అధికారులు హాజరయ్యారు. అందరూ కలిసి ఓచోట కూర్చున్న సమయంలో కేసీఆర్ పాలనపై చర్చ మొదలైందట. పాలన పూర్తిగా కుటుంబమయం అయిందని ఒక్కొక్కరుగా తమ ఆవేదనను వెళ్లగక్కడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే ఓ ఎమ్మెల్యే నియంత పాలన అంటూ ఓ రాగం అందుకున్నారట.ఆ మ్యాటర్ కాస్త కేసీఆర్ దాక వెళ్ళిందట. దీంతో.., తాను అడ్డంగా ఇరుక్కొని పోయానన్న విషయం మంత్రిగారికి అర్ధం అయ్యి.., కేసీఆర్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. అయినా.., ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఎంతోకాలం లేదన్న చర్చ నడుస్తోంది. కానీ.., కేసీఆర్ రాజకీయం ఎప్పుడు లోతుగానే ఉంటుంది. పరిస్థితిని బట్టి పావులు కదపడం ఆయన స్టయిల్. మరి ఈ విషయంలో కేసీఆర్ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.