రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. దేశానికి రెండో రాజధాని గనుక ఉంటే అది కచ్చితంగా హైదరాబాద్ మాత్రమే అయి ఉండాలని ఆయన సూచించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి నేడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ఎత్తైన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఆవిష్కరించనుంది. ఈ తరుణంలో అంబేడ్కర్కు తెలుగు నేలతో ఉన్న అనుంబంధాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయనకు తెలంగాణతో ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియాకు స్వాతంత్ర్యం రాగానే దేశ రాజధానిగా ఢిల్లీని ప్రతిపాదించినప్పుడు ఆయన వ్యతిరేకించారు. రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే అది హైదరాబాద్ అయి ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్స్ స్టేట్స్’ అనే బుక్లో అంబేడ్కర్ పేర్కొన్నారు.
నిజాం నవాబుకు అంబేడ్కర్కు మధ్య మంచి అనుబంధం ఉండేది. హైదరాబాద్ స్టేట్ను భారత యూనియన్లో కలపాలని కోరిన వారిలో అంబేడ్కర్ కూడా ఒకరు. మైసూర్, జైపూర్, కశ్మీర్ రాజులతో పాటు నిజాం రాజుకు కూడా జీవితకాలం రాజప్రముఖ్ గుర్తింపు లభిస్తుందని నచ్చజెప్పి, హామీ ఇచ్చారు అంబేడ్కర్. ఆయన్ను నిజాం రాజు బాగా విశ్వసించేవారు. రెండో రౌండ్ టేబుల్ మీటింగ్లో అంబేడ్కర్ పాల్గొనేందుకు లండన్ ప్రయాణ, వసతి ఖర్చులను నిజాం సర్కారే భరించింది. దీన్ని బట్టి నిజాంకు అంబేడ్కర్తో ఉన్న అనుబంధం ఏంటో అర్థమవుతుంది. హైదరాబాద్ గడ్డ మీద 1932 సెప్టెంబర్ 3వ తేదీన తొలిసారిగా అడుగుపెట్టారు అంబేడ్కర్.
నిజాం ప్రభుత్వ 72వ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. 1942లో కూడా ఆయన నగరానికి విచ్చేశారు. 1944లో సిటీలో ఎస్సీ ఫెడరేషన్ మహాసభలో పాల్గొని అంబేడ్కర్ చారిత్రక ప్రసంగం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో సికింద్రాబాద్ను సందర్శించారు అంబేడ్కర్. అక్కడి పెండర్గాస్ట్ రోడ్డులో అప్పటి పార్లమెంట్ సభ్యుడు జేహెచ్ సుబ్బయ్య అంబేడ్కర్కు ఆతిథ్యం ఇచ్చారు. ఆఖరుగా 1953లో హైదరాబాద్కు వచ్చారాయన. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంబేడ్కర్కు గౌరవ డాక్టరేట్ అందజేసి సముచితంగా గౌరవించింది. దేశంలోనే తొలిసారిగా అంబేడ్కర్కు ఓయూ గౌరవ డాక్టరేట్ అందజేసి, సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించిందని పలువురు ప్రొఫెసర్లు తెలిపారు.