తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికీ వీధి కుక్కల దాడిలో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో బాలుడు సైతం వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు.
గత కొంత కాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాజాగా తెలంగాణలో ఓ చోట వీధి కుక్కలు హల్ చల్ చేశాయి. ఈ కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్తతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
తెలంగాణలోని హన్మకొండ జిల్లా కమాలపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామం. ఇక్కడే ఇనుగుల ధనుష్ (12) అనే బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఊళ్లోని ప్రభుత్వ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. ఇకపోతే, ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీరి గ్రామంలో సొమవారం విద్యా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు అంతా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో ధనుష్ కూడా పాల్గొన్నాడు. అయితే, గ్రామంలో ఓ చోట విద్యార్థుల మీదకు వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఆ కుక్కల దాడి నుంచి ధనుష్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా ఆ కుక్కలు వదలకుండా ధనుష్ ను తీవ్రంగా దాడి చేశాయి. అతని కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధనుష్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.