ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ఇలాంటి ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తమ కుటుంబ పెద్దని కోల్పోయి రోడ్డున పడుతున్నారు. సామాన్యుకే కాదు సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు రోడ్డు ప్రమాదాలు తప్పడం లేదు. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
శనివారం ఉదయం తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కర్ణాటక లోని శృంగేరీ పీఠ సందర్శనకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మరువక ముందే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ కి వస్తుండగా 44వ జాతీయ రహదారి పై కొరటికల్ వద్ద ఒక్కసారిగా ఆవు అడ్డు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి ఆవుని ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే చేతి వేళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆయనను మరో వాహనంలో బోథ్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.