హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ బైకుపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఛాతీ, పొట్ట, ముఖం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న సాయితేజ్ ను మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల వెంటనే ఆసుపత్రికి పరుగులు తీశారు.
ప్రస్తుతం సాయి ధరమ్ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని.. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నట్లు సమాచారం. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ప్రమాదంలో సాయి కుడి కంటి భాగంతో పాటు ఛాతీ భాగంలోనూ గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాలర్ బోన్ విరగడం మినహా శరీరంలో అంతర్గత గాయాలేవీ లేవని తెలిపారు.
‘సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరు తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని.. త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు.