సివిల్స్ లో ప్రతిభ కనబరిచిన వారిలో అత్యధిక మంది పెట్టి పుట్టన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్ వాల నుంచి మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టుకొచ్చిన వారే. అలాంటి వారు ఎందరో ఉన్నారు. మరికొందరు లక్షల జీతాన్ని కాదని.. లక్ష్యం కోసం, సమాజా సేవ కోసం సివిల్స్ వైపు అడుగులు వేసి.. విజయం సాధిస్తారు. అలాంటి వారిలో అన్వేషా రెడ్డి ఒకరు. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్-2016 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 80 వ ర్యాంకు సాధించారు. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తపనతో కష్టపడి సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించారు అన్వేషా రెడ్డి. మరి.. ఆమె తన తల్లికి ఇచ్చిన మాట ఏమిటి? ఐఏఎస్ కావడానికి ఆపడి కష్టాలు ఏమిటి? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర వనపర్తి జిల్లా పాన్ గల్ మండలంలోని అన్నారం అన్వేషా రెడ్డి స్వగ్రామం. ఆమె తల్లిదండ్రులు సుగుణమ్మ, యుగంధర్ రెడ్డి.. ఇద్దరు ఉపాధ్యాయులే. అన్వేషా రెడ్డి తమ్ముడు అకిల్ రెడ్డి. ఆమె పదో తరగతి వరకు మహబూబ్నగర్లో చదివింది. అలాగే ఇంటర్మీడియట్ ఐఐటీ రామయ్య అకాడమీలో చదివారు. అయితే ఆమె ధన్బాద్లో చదువుతున్నప్పుడు.. ఐపీఎస్ అధికారి అంబరీశ్ మిశ్రా సారథ్యంలో నడుస్తున్న “కర్తవ్యం” అనే ఎన్జీవోలో కొద్దికాలం వలంటీర్గా పనిచేసింది. మిశ్రా ఆలోచనలు ఆమెను ప్రభావితం చేశాయి. దీంతో నలుగురి కోసం పనిచేయాలని మదిలో పడిపోయింది. ఆ తర్వాత జార్ఖండ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. ఈక్రమంలో టాటా స్టీల్స్ లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. లక్షల్లో జీతం వస్తుంది. అయిన ఆమెకు సంతృప్తి లేదు.
ప్రజలకు సేవలోనే తనకు తృప్తి ఉందనుకుంది. దీంతో లక్షల జీతాన్ని కాదనుకొని.. యూపీఎస్సీ సివిల్ సర్వీసుల వైపు అడుగులు వేసింది. మొదటి ప్రయత్నంలోనే 2015లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లింది. మొదటి ప్రయత్నంలో తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని.. రెండో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. లక్ష్యం సాధించే వరకు రెండు సంవత్సరాలు ఇంటికి కూడా రాలేదు అన్వేషా రెడ్డి. అయితే సివిల్స్ రాయడానికి చాలా కుటుంబ సవాల్ ను కూడా ఆమె ఎదుర్కొన్నారు. ఓ దశలోనే, పెండ్లి చేసుకోమంటూ తల్లివైపు నుంచి కొంత ఒత్తిడి వచ్చింది. సివిల్స్ నా లక్ష్యం. అనుకున్నది సాధించేందుకు కొంత సమయం ఇవ్వండి అంటూ అమ్మానాన్నలను ఒప్పించింది. మీ కూతురు కలెక్టర్ గా తిరిగి వస్తుందని వాళ్ల అమ్మకి మాట ఇచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
అన్వేషా రెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే నాకు సివిల్స్లో ర్యాంకు వచ్చింది. కాబట్టి.., తెలంగాణ నుంచి ఎంపికైన ఐఏఎస్ అధికారినని గర్వంగా చెప్పగలను. నేను పాలమూరు బిడ్డను. ఇక్కడ ప్రజల కష్టాలు, కరువులు చూస్తూ పెరిగాను. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేకుండా చదివిస్తున్నారు. కష్టపడి కలలు నెరవేర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా ఏ గణాంకాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. లక్ష్యంపైనే గురిపెడితే ఏదైనా సాధించవచ్చు.. అది సివిల్స్ కావచ్చు.., గ్రూప్స్ కావచ్చు”అని ఆమె తెలిపారు. మరి.. ఈ యువ ఐఏఎస్ అధికారి సక్సెస్ సోర్టీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.