రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 40 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. పది రోజుల పాటు కొనసాగే గణేష్ చతుర్థి వేడుకల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలనుంచి వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా అనేక రూపాల్లో గణేష విగ్రహం తయారు చేయటంతో, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రాచర్యం పొందాయి. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విగ్రహం ఎత్తు 9 అడుగులకే పరిమితం చేసారు. అంతకు క్రితం ఏడాది 2019లో 61 అడుగులుగా నిర్మించారు. కాగా ఈ ఏడాది తయారుచేసే విగ్రహం ఎత్తు 40 అడుగులుగా నిర్ధారించారు. 2021 అవతారం ఏకాదశ రుద్ర మహా గణపతి – లక్ష్మీ దేవి, పార్వతి దేవి దేవతల విగ్రహాలతో కూడి ఉంటుంది. ఈ ఏడాది థీమ్ కరోనా సంక్షోభం నుంచి తిరిగి పునరుజ్జీవనం. ఖైరతాబాద్ గణేషుడి రూపశిల్పి రాజేంద్రన్ చిన్న పూజ అనంతరం ఈ ఏడాది విగ్రహం పని ప్రారంభించారు. విగ్రహ తయారీలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు హస్త కళాకారులు పాల్గొంటారు.
సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తెలిపింది. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుతామని ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్రావు తెలిపారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఉత్సవాలు సెప్టెంబర్ 10న ప్రారంభమై 19వ తేదీ ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ముగుస్తాయి. విశ్వనగరం హైదరాబాద్ కు ప్రత్యేకత తీసుకొచ్చే వరల్డ్ ఫేమస్ ‘ఖైరతాబాద్ గణేశ్’కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఖైరతాబాద్ భారీ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు.
విగ్రహానికి ముందు నందీశ్వరుడు, గరుఖ్మంతుడు ప్రార్థిస్తున్నట్టుగా కూర్చుని ఉంటారు. వారికి వెనుక ఒకవైపు సింహం, మరో వైపు గుర్రం ఉంటాయి. ఇక మహా గణపతి మంటపానికి ఒక వైపు కాళీ మాత రూపంలోని కృష్ణుడిని ఆరాధిస్తున్న రాధ, మరోవైపు నాగదేవత విగ్రహాలు కొలువుదీరనున్నాయి.