సాధారణంగా వాహనాలపై చలానాలు పెండింగ్లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ససేమిరా అంటారు.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా తప్పదని అంటారు. అందుకే చాలా మంది చలానాలు లేకుండా.. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే చెల్లించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక చలానాలు కట్టని వారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతుంటారు. ఎక్కడ నుంచి ఫోటో కొడతారో తెలియదు.. చలాన్లు కట్టాలని మెసేజ్ లు వస్తుంటాయి. అయితే కొంత మంది రాజకీయ నేతలు, బడా బాబులు, అధికారులకు ఈ రూల్స్ అతిక్రమిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం.
ఇక అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లా కలెక్టర్ వాహనానికి 23 చలానాలు పెండింగ్లో ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. కలెక్టర్ 22వేల 905 చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఇ-చలాన్ సిస్టం’ వెబ్సైట్లో తేలింది. అతివేగం, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం, జీబ్రా లైన్ను క్రాస్ చేయడం లాంటి అతిక్రమణలకు ఈ చలానాలు విధించారు.
తాజాగా జనగామ జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్కు బదిలీపై వెళ్లిన నిఖిల అధికారిక హనానికి పోలీసులు ఈ చలానాలు విధించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతగల కలెక్టరే తన చలానాలు చెల్లించకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి.