మాఘ మాసం మొదలైంది. పెళ్లి హడావుడిని తెచ్చింది. ఎటు చూసినా వివాహ తంతే. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. పెళ్లిళ్లు బంధువులు, చుట్టాల రాకతో సందడి నెలకొంటున్నాయి. అయితే తెలంగాణాలోని ఆ ఊరు పెళ్లిళ్లు జాతరను తలపిస్తున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడే కనిపిస్తోంది. అదే నాగర్ కర్నూల్.
‘మాఘ మాసం ముహుర్తం చూసుకుంది. పెళ్లి మేళం తథాస్తు అని పాడుతోంది’ అంటూ పాటలు పాడుకుంటారు పీటలెక్కబోతున్న వధూవరూలు. మాఘమాసం వచ్చేయడంతో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ మాసం పెళ్లిళ్లకు ప్రసిద్ధి కావడంతో ప్రతి ఊరు, పల్లె, నగరాలు ఎక్కడ చూసినా పెళ్లి మండపాలు, భాజా భంజ్రతీల మోతలు, సన్నాయి రాగాలు, బంధువుల రాకపోకలు కనిపిస్తున్నాయి. అయితే ఓ ఊరిలో ఈ సమయంలో మహా అయితే ఎన్ని పెళ్లిళ్లు జరుగుతాయి. ఓ పది, పదిహేను. కానీ నాగర్ కర్నూల్ లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అదీ కూడా ఒక్క రోజులోనే.
ఒకేసారి 220 జంటలు ఒక్కటి కాబోతున్నాయి. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహ వేడుకలు జరుగుతున్నాయి. వీరు సామూహిక వివాహాలు చేపట్టడం ఇది ఐదోసారి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10.05 గంటలకు ఈ వివాహలు జరగనున్నాయి. పెళ్లి తంతులో భాగంగా శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్లను నిర్వహించారు. నూతన దుస్తులు ధరించి, ఈ వేడుకల్లో పాల్గొన్న పెళ్లి కుమార్తెలు సంబరపడిపోయారు. ఒకేచోట వీరంతా చేరి సందడి చేశారు.
ఈ వివాహ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. వివాహం రోజున ప్రధాన వేదికపై లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ వేడుక యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో జరగనుంది. అనంతరం పెళ్లి చేసుకోబోతున్న జంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరపనున్నారు. ఎంతో మంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న సమస్య. ఘనంగా పెళ్లి చేయాలన్న వారి కలను తాము చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి తెలిపారు.