ఒక్క భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా గోవాకు ఎంతో మంచి గుర్తింపు ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి గోవాకి పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే వేసవికాలం వస్తోంది అంటే గోవాకి టూరిస్టుల తాకిడి పెరుగుతుంది. గోవాలో కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు నీటిలో మునిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు లైఫ్ సేవింగ్ కోస్టల్ గార్డ్స్ ఉంటారు. అయితే ఇకనుంచి ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు గోవా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీచ్ లలో AI టెక్నాలజీతో సేవలందించే రోబోలను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
గోవా అనేది అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతం. ఇంక వేసవికాలం వచ్చింది అంటే అంతర్జాతీయ పర్యాటకులతో కిక్కిరిసి పోతుంది. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడం కూడా ఎంతో కష్టమైన పని. గోవాలో దాదాపుగా వెయ్యిమందికి పైగా లైఫ్ సేవింగ్ కోస్టల్ గార్డ్స్ ఉంటారు. ప్రభుత్వ అనుమతితో ఓ ప్రైవేటు ఏజెన్సీ ఈ సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం అతి కొద్దిరోజుల్లో గోవా బీచ్ లలో ఏఐ టెక్నాలజీతో సేవలందించే రోబోలను మనుషుల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించనున్నారంట. అవును ఆ రోబోలను ప్రాణాలు కాపాడేందుకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు.
గడిచిన రెండేళ్లలో గోవాలో దాదాపుగా వెయ్యిసార్లు రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. అయితే ఇక నుంచి అలాంటి పరిస్థితులు రాకముందే కట్టడి చేసేందుకు గోవా చర్యలు తీసుకుంటోంది. ఆరుస్, ట్రిటోన్ అనే ఏఐ బేస్ డ్ రోబోలను తీసుకురానున్నారు. ఇవి నాన్ స్విమ్ జోన్లను గుర్తించి పర్యాటకులను అలర్ట్ చేయడం, ఎవరికైనా ప్రమాదం జరిగితే దగ్గర్లో ఉన్న లైఫ్ సేవింగ్ గార్డ్ కు సమాచారం చేరవేయడం చేస్తాయి. అలాగే క్రౌడ్ ని కట్టడి చేయడంలో కూడా ఈ రోబోలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. 10 ఆరుస్, 100 ట్రిటోన్ రోబో సేవలను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే మిరామర్ బీచ్ లో ఆరుస్ సేవలు అందిస్తోంది. పలు బీచ్ లలో ట్రిటోన్ సేవలను కూడా ఉపయోగిస్తున్నారు.