ఐఫోన్ అంటే ఎవరికి నచ్చుదు చెప్పండి. కొంతమందికి అయితే ఐఫోన్ అనేది ఒక ఎమోషన్. సెక్యూరిటీ పరంగానూ చాలా నమ్మదగినది ఐఫోన్. ఇప్పటికీ కొందరు పాత ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ను వాడుతూనే ఉన్నారు. వాటిపై కొందరికి అనుమానాలు మొదలయ్యాయి. అంత పాత ఓఎస్ కదా.. మాకు సురక్షితమేనా అని. ఎవరైతే IOS 12తో రన్ అవుతున్న ఫోన్లు వాడుతున్నారో.. వారికోసం ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది యాపిల్. ఈ జాబితాలో ఐఫోన్ 5s , ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2, మినీ 3, 6th జనరేషన్ ఐపాడ్ టచ్ వంటివి ఉన్నాయి.
యాపిల్ సంస్థ తన యూజర్లకు ఒక నోట్ విడుదల చేసింది. ఆ నోట్లో పైన చెప్పిన జాబితాలోని ఫోన్లు, గాడ్జెట్స్ వాడుతున్న వారిని IOSను 12.5.4కు అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ అప్డేట్ ద్వారా యూజర్లకు అదనపు భద్రత లభిస్తుందని భరోసా నిచ్చింది. అయితే జాబితాలోని ఫోన్ల కోసం IOS 13 విడుదల చేయలేదని.. ఎలాంటి ఫేక్ వార్తలు నమ్మకండని స్పష్టం చేసింది. మీ డేటా, పేమెంట్ డీటేయిల్స్ వంటివి చోరీకి గురి కాకుండా ఉండాలంటే వారు వెంటనే IOS 12.5.4కు అప్డేట్ చేసుకోవాల్సిందిగా యాపిల్ సంస్థ సూచించింది.
మీ ఐఫోన్ను అప్డేట్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్లి, జనరల్పై నొక్కండి, తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోండి. అయితే కొత్త IOS అప్డేట్కు సరిపడా మీ ఫోన్లో స్పేస్ ఉందో లేదో ముందే పరిశీలించుకోండి.
ఐఫోన్లు 13 సిరీస్ వరకూ వచ్చేశాయి. కానీ, యూజర్లు ఇంకా ఐదు, ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన ఐఫోన్ 5S, 6, 6ప్లస్ ఫోన్లను కూడా వాడుతున్నారు. 2020లో ఓ నివేదిక లెక్కల ప్రకారం ఐఫోన్ 6ను మొత్తం యూజర్లలో 5.3 శాతం మంది వాడుతున్నారు. 5Sను 1.5 శాతం మంది యూజర్లు వాడుతున్నారు. ఐఫోన్ 6ప్లస్ను అయితే దాదాపు 1.4 శాతం మంది యూజర్లు వాడుతున్నారు. అంటే పాత ఫోన్లు కూడా బంగారమే కదా?