రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టుకు ఘోర అవమానం జరిగింది. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది.
క్రికెట్లో మేటి జట్లుగా చెప్పుకునే వాటిల్లో వెస్టిండీస్ ఒకటి. హార్డ్ హిట్టింగ్తో అదరగొట్టే బ్యాటర్లు, బౌన్సర్లతో భయపెట్టే బౌలర్లు విండీస్ సొంతం. జెంటిల్మన్ గేమ్ను కొన్ని దశాబ్దాల పాటు శాసించిందా టీమ్. అయితే ఇదంతా ఒకప్పటి మాట. కరీబియన్ టీమ్ ఆట నానాటికీ తీసికట్టుగా మారింది. వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్లు ఆడే స్థాయికి ఆ జట్టు దిగజారింది. తాజాగా జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లో వెస్టిండీస్ ఇంటిబాట పట్టింది. పసికూన స్కాట్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్ నిష్క్రమించడంతో సూపర్ సిక్సెస్లో ఇప్పటికే చెరో గెలుపు సాధించిన జింబాబ్వే, శ్రీలంకకు టాప్-10లో నిలిచేందుకు రూట్ క్లియర్ అయింది. కాగా, తొలుత జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన వెస్టిండీస్.. అనంతరం నెదర్లాండ్స్ చేతిలోనూ ఓటమి చవిచూసింది.
స్కాట్లాండ్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో విండీస్ ఫస్ట్ బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో జేసన్ హోల్డర్ (45), రొమేరియో షెపర్డ్ (36), బ్రాండన్ కింగ్ (22), నికోలస్ పూరన్ (21) ఫర్వాలేదనిపించారు. కానీ ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయారు. దీంతో ఆ టీమ్ కేవలం 181 రన్స్ మాత్రమే చేయగలిగింది. స్వల్ప టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ బ్యాటింగ్లో దుమ్మురేపింది. ఓపెనర్ మాథ్యూ క్రాస్ (74 నాటౌట్), బ్రాండన్ మాక్ములెన్ (69) ఆకట్టుకోవడంతో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేజ్ చేసింది. ఈ ఓటమితో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నుంచి విండీస్ అధికారికంగా నిష్క్రమించింది. రెండుసార్లు ప్రపంచ కప్ నెగ్గిన జట్టు ఇలా వెనుక పడిపోవడం చూసి అభిమానులు చాలా బాధపడుతున్నారు.