టీమిండియా వెటరన్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దాని గురించి తెలిస్తే మీరు కూడా అతడికి సెల్యూట్ చేయక మానరు.
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆటకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన కీపింగ్ స్కిల్స్తో అతడు కోట్లాది మంది ఫ్యాన్స్ హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో సాహా అద్భుతమైన కీపింగ్తో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత భారత జట్టులో కీపర్గా, మిడిలార్డర్ బ్యాటర్గా కీలక పాత్ర పోషించాడు సాహా. లాంగ్ ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్ల సుడులు తిరిగే బాల్స్ను వికెట్ వెనుకాల అందుకోవడంలో సాహా ఆరితేరాడు. అయితే రిషబ్ పంత్ ఎంట్రీతో సాహా ప్లేస్ గల్లంతైంది. సాహా ఫామ్లేమితో చోటు కోల్పోగా.. అదే టైమ్లో పంత్ అద్భుత పెర్ఫార్మెన్స్తో తన ప్లేస్ను పక్కా చేసుకున్నాడు. దీంతో సాహా డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్కే పరిమితం అయ్యాడు. అలాంటి సాహా తన మంచి మనసును మరోమారు చాటుకున్నాడు. యువ క్రికెటర్ల కోసం అతడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.
కుర్రాళ్ల కోసం గొప్ప అవకాశాన్ని సాహా వదులుకున్నాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టులో వికెట్ కీపర్గా సాహాకు ఛాన్స్ ఇచ్చినా.. అతడు సున్నితంగా తిరస్కరించాడని త్రిపుర సెలెక్టర్ జయంత్ దే తెలిపారు. టీమిండియాలోకి వద్దామనుకునే యంగ్ క్రికెటర్ల కోసం నిర్వహించే ఈ ట్రోఫీలో తాను ఆడనని సాహా చెప్పాడని పేర్కొన్నారు. తాను భారత జట్టుకు ఆడనప్పుడు ఆ ప్లేస్లో మరో యువకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సాహా అలా చెప్పాడని జయంత్ దే వివరించారు. సాహా మాటలు సెలెక్టర్లను కదిలించాయన్నారు. ఇకపోతే, దులీప్ ట్రోఫీలో ఆడే ఈస్ట్ జోన్ టీమ్ వికెట్ కీపర్గా, కెప్టెన్గా ఇషాన్ కిషన్ను తీసుకోవడానికి సెలెక్టర్లు మొగ్గు చూపారు. అయితే ఆడేందుకు ఆసక్తిగా లేనని ఇషాన్ చెప్పాడు. దీంతో సాహాను సెలెక్టర్లు సంప్రదించారు. కానీ అతడు కూడా నో చెప్పడంతో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్కు ఛాన్స్ ఇచ్చారు. సాహా నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.