వెస్టిండీస్ తో రెండో టెస్టులో భారత సారథి రోహిత్ శర్మ అరుదైర రికార్డు సొంతం చేసుకున్నాడు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డుల్లో కెక్కాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిట్ మ్యాన్ పనైపోయిందని ఇక రిటైర్మెంట్ ప్రకటించి మర్యాదగా తప్పుకుంటే బాగుంటుందని విమర్శించారు. మరి కొందరైతే ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ రోహిత్ కెరీర్ లో చివరిదని అపుడే జోస్యం చెప్పేసారు. నిజానికి రోహిత్ ప్రదర్శన గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో లేదనేది వాస్తవం. అయితే మొన్నటివరకు ఈ వ్యాఖ్యల్లో అర్ధం ఉన్నట్లుగా అనిపించినా.. తాజాగా తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో సత్తా చాటుతున్నాడు. తొలి టెస్టులో సెంచరీ బాదేసిన హిట్ మ్యాన్.. రెండో టెస్టులో కూడా రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీ చేసి మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ఇప్పటివరకు ఎవరూ సాధించలేని రికార్డుని సాధించి చరిత్ర సృష్టించాడు.
103, 80, 57 ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్ లో రోహిత్ శర్మ సాధించిన పరుగులివి. ఈ సిరీస్ లో 240 పరుగులు చేసిన రోహిత్.. 146 ఏళ్ళ టెస్టు రికార్డుని బ్రేక్ చేసాడు. డొమినికాలో జరుగుతున్నా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 57 పరుగులు చేసి వరుసగా 30 ఇన్నింగ్స్ లో రెండంకెల స్కోర్ చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. చరిత్రలో ఎంతో మంది గ్రేట్ బ్యాటర్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోవడం విశేషం. టెస్టు క్రికెట్ లో పరుగులు చేయడం చాల కష్టంతో కూడుకున్నది. అయితే రోహిత్ బరిలోకి దిగితే కనీసం రెండంకెల స్కోర్ సాధించాల్సిందే. గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే ఇలాంటి క్రెడిట్ సాధించినా హిట్ మ్యాన్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసాడు. దీంతో ప్రస్తుతం ఈ రేర్ రికార్డ్ ప్రస్తుతం రోహిత్ పేరిట ఉండడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే విండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ 5 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కేవలం 24 ఓవర్లలోనే 2 వికెట్లకు 181 పరుగులు చేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. రోహిత్(57), ఇషాన్ కిషన్(52) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీలు చేయడంతో విండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.భారీ లక్ష్య ఛేదనలో ప్రస్తుతం విండీస్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. క్రీజ్ లో చంద్రపాల్ (24), బ్లాక్ వుడ్ (20) ఉన్నారు. ఇంకా విండీస్ జట్టు గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. మరో వైపు భారత్ గెలవాలంటే చివరి రోజు 8 వికెట్లు తీయాల్సిందే. మొత్తానికి మ్యాచ్ సంగతి పక్కన పెడితే రోహిత్ చారిత్రాత్మక రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.