భారత క్రికెటర్లలో అత్యంత సంపన్న ఆటగాడు ఎవరంటే ప్రతి ఒక్కరికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు గుర్తు రావడం సహజమే. కానీ వీరెవరూ కాకుండా మరో ఆటగాడు ఈ ఘనత సాధించాడంటే నమ్మగలరా!
యావత్ ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ ఉన్న క్రీడల్లో ఒకటైన క్రికెట్కు ఆసియా దేశాల్లో అభిమాను బ్రహ్మరథం పడుతారు. దీంతో సహజంగా ఈ దేశాల్లో క్రికెటర్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్తో పాటు ఆస్తి పాస్తులు సమకూరుతాయి. భారత క్రికెటర్లనే చూసుకుంటే.. ఒక వైపు వార్షిక కాంట్రాక్ట్లు, మరో వైపు ఎండార్స్మెంట్లు.. ఇటు మ్యాచ్ ఫీజులు.. అటు అడ్వర్టైజ్మెంట్లు ఇలా ఎటు చూసినా డబ్బే డబ్బు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమ్ఇండియా స్టార క్రికెటర్ విరాట్ కోహ్లీ.. వార్షిక ఆదాయం ఇటీవలే వెయ్యి కోట్లు దాటిందనే వార్తలు రాగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (రూ. 1250 కోట్లు), మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (రూ. 1040 కోట్లు) ఇప్పటికే థౌజెండ్వాలా పేల్చేశారు. ఆసియా ఖండంలోనే సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఘనత సాధించిన విరాట్ కోహ్లీ.. సామాజిక మాధ్యమాల్లో ఒక్క పోస్ట్ పెట్టాలంటే కోట్లకు కోట్లు తీసుకుంటాడనే విషయం తెలిసిందే. అయితే ఇంతలా సంపాదిస్తున్న వీరెవరూ ప్రపంచంలో అత్యధిక సంపన్న క్రికెటర్లు కారంటే నమ్మగలమా.
సచిన్, కోహ్లీ, ధోనీలను మించి ఆస్తులున్నాయంటే.. అతడే స్టార్ క్రికెటరో అనుకుంటే మీరు పొరపడినట్లే. దేశవాళీలకే పరిమితమై అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఓ సాధారణ ఆటగాడే.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెటర్గా నిలిచాడు. అతడే.. గుజరాత్లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్ రంజిత్ సింగ్ గైక్వాడ్. ప్రస్తుతం సమర్జిత్ ఆస్తి విలువ సుమారు రూ. 20 వేల కోట్లకు పై మాటే. రాజవంశానికి చెందిన సమర్జిత్ సింగ్.. 1967 ఏప్రిల్ 25న వడోదర మహారాజు రంజిత్సింగ్ ప్రతాప్ గైక్వాడ్, శుభంగిని దంపతులకు జన్మించాడు. డెహ్రాడూన్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన సమర్జిత్ ఆ తర్వాత తన ఇష్టంతో క్రికెట్ వైపు మళ్లాడు. అయితే దేశవాళీల్లో ఫర్వాలేదనిపించిన అతడు.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు.
తండ్రి రంజిత్ సింగ్ మరణానంతరం సమర్జిత్ మహారాజుగా పట్టాభిషేక్తుడయ్యాడు. దీంతో వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులతో అతడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్గా ఎదిగాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్షీ విలాస్ ప్యాలెస్కు ఇతడే యజమాని. ఇదే కాకుండా లెక్కకు మిక్కిలి ఆస్తులకు యజమాని అయిన సమర్జిత్ వీటి ద్వారా ప్రపంచ సంపన్న క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత తొలి తరం కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా రాజవంశానికి చెందిన వాడే అన్న విషయం తెలిసిందే. ఆయన వారసుడైన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోగా రాణిస్తూనే.. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సంరక్షిస్తున్నాడు.