గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరమైన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రీఎంట్రీలో గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. ఐర్లాండ్తో సిరీస్కు సెలెక్షన్ కమిటీ బుమ్రాను సారథిగా ఎంపిక చేసింది.
వెన్నముక శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకున్న ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ పొందుతున్న బుమ్రా.. ఇటీవలే సాధన ప్రారంభించగా.. అతడికి బీసీసీఐ జట్టు పగ్గాలు అప్పగించింది. ఆగస్టు 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా.. ఐర్లాండ్తో భారత జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుండగా.. దీనికోసం సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. గతేడాది సెప్టెంబర్లో చివరి సారి జాతీయ జట్టు తరఫున ఆడిన బుమ్రా.. ఆ తర్వాత వెన్నునొప్పితో టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. ఆసీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్నకు అందుబాటులో లేకుండా పోయిన బుమ్రా.. జట్టులోకి తిరిగి వస్తూనే కెప్టెన్సీ పోస్ట్ కొట్టేశాడు.
ఈ ఏడాది ఆసియాకప్తో పాటు స్వదేశంలో ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో బుమ్రా కోలుకోవడం ముఖ్యమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్సీఏలో శిక్షణ షురూ చేసిన బుమ్రా.. నెట్స్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తూ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కోసం ఇటీవల ముంబైతో మ్యాచ్లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జస్ప్రీత్.. అంతర్జాతీయ క్రికెట్కు తన సన్నద్ధత తెలుపగా.. సెలెక్షన్ కమిటీ అతడిని ఐర్లాండ్తో సిరీస్కు ఎంపిక చేసింది. అక్టోబర్ 5 నుంచి స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ వంటి వాళ్లకు బోర్డు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. కాగా.. గాయాల నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో సెలెక్షన్ కమిటీ వీరి పేర్లను పరిశీలించలేదు.
సీనియర్ల గైర్హాజరీలో ఐర్లాండ్ టూర్కు యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్లోనూ అద్వితీయ శతకం బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు.. తెలంగాణ కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతకుముందు విండీస్తో పొట్టి సిరీస్కు కూడా తిలక్ వర్మ ఎంపికనై విషయం తెలిసిందే. ఈ పర్యటనలో బుమ్రా డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. గాయం నుంచి కోలుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చాన్నాళ్ల తర్వాత టీమ్లోకి వచ్చాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున తన విధ్వంసక బ్యాటింగ్ ౖస్టెల్తో వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్తో పాటు.. సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు
బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, అవేశ్ ఖాన్.