పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ పాక్ సీనియర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రతిభ, ఎదుగుదలను చూసి మా సీనియర్లు ఓర్వలేరంటూ వివాదానికి తెరలేపాడు. ఇతరులు సక్సెస్ అయితే వారు సంతోషంగా ఉండలేరని చెప్పాడు. ఈ విషయం తాను ఇదివరకే చెప్పినా మళ్లీ చెబుతున్నానని తెలిపాడు. చాలా రోజులుగా జట్టులో చోటు కోల్పోయిన షెజాద్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్థాన్ క్రికెట్లో సీనియర్లు.. జూనియర్లకు, యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సహకారం ఇవ్వకపోగా.. తమ సక్సెస్ను ఈర్ష్య పడతారని అన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ధోనిని ఉదహరించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సక్సెస్ వెనక ధోనీ ఉన్నాడని అన్నాడు. ‘విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడానికి ధోనీనే కారణం. అతను అండగా ఉంటూ మద్దతివ్వడం వల్లే విరాట్ కోహ్లీ విజయవంతమయ్యాడు. కానీ, దురదృష్టం కొద్దీ పాకిస్థాన్లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ జట్టులోని సీనియర్లు, మాజీ ఆటగాళ్లు.. ఎవరైనా అద్భుతంగా ఆడితే తట్టుకోలేరు. వారు విజయవంతమైతే సహించలేరు.
అలాగే విరాట్ కోహ్లీ రెండేళ్లుగా ఫామ్ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. అదే నా విషయంలో రెండు మ్యాచ్లు ఆడకపోయేసరికే పక్కనపెట్టారు. నన్ను దేశవాళీ క్రికెట్లో ఆడమన్నారు. అక్కడ నేను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినా పాకిస్థాన్ తరఫున ఆడటానికి మరో అవకాశం ఇవ్వలేదు’ అని షెజాద్ చెప్పుకొచ్చాడు. వఖార్ యూనిస్ తన కెరీర్ను నాశనం చేశాడని అహ్మద్ షెజాద్ ఆరోపించాడు. ఈ విషయం పీసీబీ పెద్దలే తనకు తెలియజేశారని వాపోయాడు. కాగా.. షెజాద్ ఆరోపణలపై పాక్ మాజీలు ఆగ్రహం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.