మహ్మద్ సిరాజ్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. టీమిండియా అత్యుత్తమ పేసర్ గా అభినందనలు పొందుతున్నాడు. బుమ్రా లేని లోటు తీర్చగల ఒక మంచి ఫాస్ట్ బౌలర్ దొరికాడంటూ పొగిడేస్తున్నారు. ఇంక సోషల్ మీడియాలో అయితే టీమిండియా ఫ్యాన్స్ అంతా మహ్మద్ సిరాజ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. నీ అంత ఆటగాడు లేడంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ఇదంతా ఒక ఏడాది నుంచి వచ్చిన మార్పు మాత్రమే. కానీ, గతంలో సిరాజ్ పరిస్థితి వేరు. అతను ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలు, ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. తనపై వచ్చిన విమర్శలకు సిరాజ్ బంతితోనే సమాధానం చెప్పుకొచ్చాడు.
మహ్మద్ సిరాజ్ ఇప్పుడు వన్డేలో ఎంతో అద్భుంతగా బౌలింగ్ చేస్తున్నాడు. మూడేళ్ల సుదీర్ఖ విరామం తర్వాత సిరాజ్ గతేడాది ఫిబ్రవరిలో తిరిగి టీమిండియా జెర్సీ ధరించాడు. అప్పటి నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం 20 మ్యాచుల్లోనే 37 వికెట్లు తీసుకున్నాడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎంత గొప్ప ఆటగాడు అయినా సిరాజ్ వేసే పదునైన డెలివరీలను ఎదుర్కోవడానికి వణికిపోతున్నారు. తాజాగా విడుదలైన వన్డే ర్యాంకింగ్స్ లో ట్రెంట్ బౌల్ట్, హేజల్ వుడ్ లను దాటేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 729 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
ఇదంతా ఒక్క రాత్రిలో జరిగిపోయిన అద్భుతం కాదు. టీమిండియాలో మహ్మద్ సిరాజ్ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఐపీఎల్ లో కూడా సరైన ప్రదర్శన లేదు. ఎకానమీ చూస్తే 10 దాటిపోయింది. కరెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ వేయడానికి బాగా ఇబ్బంది పడేవాడు. అతనిపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కాదు. సిరాజ్ ను రన్ మెషిన్ అంటూ ఎగతాళి చేసేవాళ్లు. అయితే సిరాజ్ వీటిని ఏమీ పట్టించుకోలేదు. కేవలం అతని ఫామ్ మీదనే దృష్టి పెట్టాడు. మైదానంలో కఠోర శ్రమ చేశాడు. జాతీయ జట్టులో స్థానం లేకపోయినా తన శిక్షణ మాత్రం ఆపలేదు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం తీసిపోకుండా.. పదునైన బంతులు విసురుతున్నాడు. జాస్ప్రిత్ బుమ్రా గాయపడిన తర్వాత టీమిండియా పేస్ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో అందరూ చూశారు. భారీ టార్గెట్లను కూడా కాపాడు కోలేకపోయింది. బుమ్రా లేని లోటుని మహ్మద్ సిరాజ్ పూర్తిగా తీర్చేశాడు. కొత్త బాల్ అందుకుని అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గతంలో ఎన్ని మాటలు పడ్డాడో.. ఇప్పుడు అన్ని ప్రశంసలు అందుకుంటున్నాడు. కోహ్లీలాంటి ఒక మంచి మెంటర్ అతనికి ఉండటం కూడా ఈ ఫామ్ కి కారణంగా చెప్పచ్చు.
విమర్శలు, ట్రోల్స్ ని ఆలోచించుకుంటూ కూర్చుని ఉంటే మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు కాదు. ఎవరైతే విమర్శించారో వారి నోటితోనే సిరాజ్ ఈజ్ గ్రేట్ అని చెప్పించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే సిరాజ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. “సిరాజ్ నుంచి మేము ఏం కోరుకుంటున్నామో అతనికి తెలుసు. కొత్త బాల్ తో స్వింగ్ చేయడం, స్టార్టింగ్ ఓవర్లలో వికెట్లు తీసుకుంటాడు. మిడిల్ ఓవర్లలో కూడా వికెట్సు పడగొడుతున్నాడు. ఎంత ఎక్కువ ఆడితే అంత ఎక్కువ రాటుతేలుతాడు” అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ తెలుగు కుర్రాడు ఇప్పుడు వన్డే క్రికెట్ ని శాసిస్తున్నాడు అనడంలో సందేహం లేదు.
𝗧𝗶𝗺𝗲 𝘁𝗼 𝗰𝗵𝗮𝗻𝗴𝗲 𝘁𝗵𝗲 𝗵𝗲𝗮𝗱𝗹𝗶𝗻𝗲𝘀📰
Mohammed Siraj is the new No.1 ODI bowler in the world 🤫 pic.twitter.com/zMQtO3YNpy
— CricTracker (@Cricketracker) January 25, 2023