వెస్టిండీస్ పర్యటనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత జట్టు.. తమ నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
భారత జట్టులో చోటు దక్కించుకోవడమే ఒక యుద్ధం లాంటిదని గతంలో ఎందరో ఆటగాళ్లు వెల్లడించారు. అయితే కొందరు ఆటగాళ్లకు మాత్రం టీమ్లో చోటు దక్కించుకోవడం పెద్ద విషయం కాదనేలా కనిపిస్తోంది. వెస్టిండీస్తో టీ20 సిరీస్ను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టంకాకమానదు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో స్పిన్ ఆల్రౌండర్ కోటాలో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్.. రెండు ఓవర్లు వేసి 22 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
ఇతర ఆటగాళ్లను బెంచ్పై కూర్చోబెట్టి.. ఒక ప్లేయర్ను జట్టులోకి తీసుకున్నారంటే.. అతడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాల్సిందే.కానీ, అక్షర్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్న భారత జట్టు.. మూడో టీ20లోనూ అదే ఫార్ములా కొనసాగించింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను తుది జట్టు నుంచి తప్పించి కుల్దీప్ యాదవ్కు తిరిగి అవకాశం కల్పించింది. అంతే తప్ప అటు బ్యాట్ తో ఇటు బంతితో కనీస ప్రదర్శన చేయలేకపోతున్న అక్షర్ పటేల్ పై మాత్రం వేటు వేయలేకపోయింది.
రెండో మ్యాచ్లో తలతిక్క నిర్ణయాలతోనే టీమిండియా పరాజయం పాలైందనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన చోట రాహుల్ ద్రవిడ్ మరోసారి కొత్త ప్రయోగానికి తెరతీసినట్లు అనిపిస్తోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించడంతో పాటు.. వేగవంతమైన అర్ధశతకం తన పేరిట రాసుకున్న యశస్విపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి టెస్టులోనే జైస్వాల్ భారీ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే.
రెండు మ్యాచ్ల్లో కలిపి రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అక్షర పటేల్.. బ్యాట్తోనూ ఆకట్టుకోలేక పోయాడు. వరుసగా 13, 14 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు కీలక సమయాల్లోనే క్రీజులోకి వచ్చిన అక్షర్ తన స్థానానికి న్యాయం చేయలేకపోయాడు. గత మ్యాచ్లో అతడికి బౌలింగ్ కూడా ఇవ్వకపోవడంతో.. మరి అతడిని జట్టులో కొనసాగించాల్సిన అవసరమేంటో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో అక్షర్ ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. మేనేజ్మెంట్ మాత్రం మూడో మ్యాచ్ లోనూ అతడికి అవకాశం ఇవ్వడం గమనార్హం.