గత కొన్ని రోజులుగా టీమిండియా సెలక్షన్ కమిటీ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీ ప్లేస్ లో కొత్త కమిటీని తీసుకురానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం తర్వాత జట్టు కూర్పు పై దృష్టి పెట్టాలని అటు క్రీడా నిపుణులతో పాటుగా సగటు క్రీడాభిమానులు కూడా సూచించారు. టీ20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ కు సంజూ శాంసన్ ను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర దుమారం రేగింది. నైపుణ్యం గల ఆటగాడిని ఎందుకు ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ఈ క్రమంలోనే శాంసన్ కు జరిగిన అన్యాయమే నాకూ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ మనీశ్ పాండే.
వరుసగా విఫలం అవుతున్న బ్యాటర్లకు అవకాశాలు ఇస్తున్నారు. అద్భుతమైన ప్లేయర్స్ కు మాత్రం ఆడే అవకాశం ఇవ్వట్లేదన్నది సెలక్షన్ కమిటీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. ఇక వరుసగా విఫలం అవుతూ.. వస్తున్నా రిషబ్ పంత్ కు అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సంజూ శాంసన్ కు ఎందుకు ఇవ్వట్లేదన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడంతోనే శాంసన్ పై వివక్ష చూపిస్తున్నారని కొందరు నెటిజన్లు సెలక్షన్ కమిటీని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాకూ సంజూ శాంసన్ లానే అన్యాయం జరిగిందని ఆరోపించాడు టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే.
తాజాగా జట్టులో చోటుపై స్పందించిన పాండే..”నాకూ శాంసన్ లాంటి పరిస్థితులే ఎదురైయ్యాయి. నేను టీమిండియాకు ఆడిన మ్యాచ్ లు కంటే రిజర్వ్ బెంచ్ లో ఉండి చూసిన మ్యాచ్ లే ఎక్కువ. ఇలా బెంచ్ లో కూర్చుని మ్యాచ్ లు చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. అదీ కాక టీమ్ ఉన్న వారికంటే మనం తక్కువా? అన్న ఫీలింగ్ సైతం వస్తుంది” అని మనీశ్ పాండే తనలో ఉన్న ఆవేదనను పంచుకున్నాడు. అయితే ఇలాంటి సమయాల్లో క్రీడాస్ఫూర్తి చాలా అవసరం అని, టీమ్ లోకి ఎంపికవ్వడం మన చేతుల్లో లేదని మనీశ్ చెప్పుకొచ్చాడు.
అదీ కాక జట్టుకు ఎవరు అవసరమో ఎవరు కాదో కోచ్ కు, కెప్టెన్ కు తెలుస్తుందని పాండే పేర్కొన్నాడు. ఇక సంజూ శాంసన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడని పాండే తెలిపాడు. ఇక జట్టులో ప్లేస్ ఉన్నా.. లేకపోయినా వేచిచూడాలని, ఈ పరిస్థితులు మన ఆటపై ఎలాంటి ప్రభావం చూపించకూడదని మనీశ్ పాండే అన్నాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ సైతం ఇదే మైండ్ సెట్ తో ఉంటే మంచిదని పాండే సూచించాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 36 పరుగులు చేసిన శాంసన్ పర్వాలేదనిపించాడు.