భారత ఫుట్బాల్ దిగ్గజంగా పేరుపొందిన మన తెలుగు క్రీడాకారుడు మహ్మద్ హబీబ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
భారత ఫుట్బాల్ దిగ్గజంగా పేరుపొందిన మన తెలుగు క్రీడాకారుడు మహ్మద్ హబీబ్ కన్నుమూశారు. హైదరాబాద్కు చెందిన ఈ దిగ్గజం 74 గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి కొన్నేళ్ల నుంచి డిమెన్షియా అండ్ పార్కిన్సన్స్ సిండ్రోమ్తో పాటు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఒక తెలుగు వాడిగా హబీబ్ సాధించిన ఘనతలు మరువలేనివి. ఆనాటి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మహ్మద్ హబీబ్ జీవిత చరిత్ర చూసుకుంటే 1949 జులై 17న హైదరాబాద్లో జన్మించారు. ఎన్నో ఏళ్లుగా ఫార్వర్డ్ ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 1965 నుంచి 76 మధ్య కాలంలో టీమిండియాకు ఆడి భారత ఫుట్బాల్ చరిత్రలోనే గ్రేట్ మిడ్ ఫీల్డర్గా ఎదిగారు. ఫుట్బాల్కు ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ప్రభుత్వం 1980లో ఆయనను అర్జున అవార్డుతో సత్కరించింది. ఇక తన కెరీర్ ముగిసే సమయంలో లెజెండ్ పీలే తనను కౌగిలించుకుని అభినందించాడని.. అదే తన కెరీర్ లో గొప్ప క్షణమని గుర్తుచేసుకున్నాడు.
హబీబ్కు కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా కోచ్గా కూడా సేవలందించారు. ఆటగాడిగా రిటైర్ అయ్యాక టాటా ఫుట్బాల్ అకాడమీకి, భారత ఫుట్బాల్ సంఘానికి చెందిన అకాడమీకి సైతం కోచ్గా ఉన్నారు. తన హయాంలో ఎంతోమంది ఆటగాళ్లను తీర్చిదిద్దారు.దిగ్గజ ఆటగాడి మరణం పట్ల తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ రఫత్, సెక్రటరీ జి. పాల్గుణ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. భారత జట్టుకు ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.