వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బుధవారం జట్టును ప్రకటించి, ధోనిని మెంటర్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ధోని నియామకంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కు గురువారం ఫిర్యాదు అందింది. కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కింద మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవిత కాల సభ్యుడు సంజీవ్ గుప్త ఫిర్యాదు చేస్తూ అపెక్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు.
ఈ అపెక్స్ లో బీసీసీఐ చైర్మన్ సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జైషా కూడా సభ్యులుగా ఉన్నారు. బీసీసీఐ రాజ్యాంగంలో క్లాజ్ 38(4) ప్రకారం ఒక వ్యక్తి రెండు విధాల ప్రయోజనం కలిగి ఉండరాదని సూచిస్తుందని, చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని జాతీయ జట్టు మెంటర్ గా ఎలా నియమిస్తారని లేఖలో పేర్కొన్నారు. కాగా దీనిపై అపెక్స్ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.