పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి , భారత సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ తర్వాత.. పశ్చిమ బెంగాల్ నుంచి టీమిండియాలో కి వచ్చి.. ఆరంభంలో ఆకట్టుకొని ఆ తర్వాత అవకాశాలను వినియోగించుకోలేకపోయిన సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి వర్గంలో సభ్యుడైన మనోజ్ తివారీ.. 2008లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 2015 వరకు అడపా దడపా అవకాశాలు దక్కించుకున్న తివారీ.. కెరీర్ లో భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2015లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన తివారీ.. దేశవాళీల్లో కొనసాగుతూ వచ్చాడు.
19 ఏళ్ల కెరీర్ లో చివరిగా ఈ ఏడాది రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడిన తివారీ.. 2012 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున 2012లో ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న తివారీ.. అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి పశ్చిమ బెంగాల్ మినిస్టర్ గా ఎదిగాడు. సామాజిక మాధ్యమాల వేదికగా.. మనోజ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘క్రికెట్ కు గుడ్ బై. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. అసలు కలలో కూడా ఊహించని విషయాలు కేవలం క్రికెట్ తోనే సాధ్యమయ్యాయి. కెరీర్ లో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆ దేవుడి సాయం లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు’ అని మనోజ్ తన రిటైర్మెంట్ నోట్ లో రాసుకొచ్చాడు.
దేశవాళీల్లో భారీగా పరుగులు చేసిన తివారీ.. 10 వేల మార్క్ కు 92 పరుగుల దూరంలో కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 48.56 సగటుతో పరుగులు రాబట్టన తివారీ.. 29 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్ లు ఆడిన మనోజ్. 42.28 సగటుతో 5581 రన్స్ చేశాడు. ఫామ్ లేమి, గాయాల కారణంగా జాతీయ జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిన మనోజ్.. ఐపీఎల్లో కోల్కతా, పుణె, ఢిల్లీ, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన ఆటతో పాటు.. దూకుడైన వ్యక్తిత్వంతో తరచూ వార్తల్లో నిలిచే తివారీ.. రిటైర్మెంట్ సందర్భంగా కోచ్ లు సహచర ఆటగాళ్లు, పంజాబ్ క్రికెట్ బోర్దు, బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘ లేఖ విడుదల చేశాడు.