వెస్టిండీస్ పర్యటనలో భాగంగా.. టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ ఓడింది. అయితే హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయాల వల్లే చేతిలో ఉన్న మ్యాచ్ పోయిందని మీకు తెలుసా?
గయానా వేదికగా విండీస్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ చూసినవాళ్లు ఎవరైనా.. టీమిండియా చేజేతులా ఓడిందని అంగీకరించక మానరు. 153 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ 127/5తో నిలిచింది. 16వ ఓవర్ వేసేందుకు వచ్చిన యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. తొలి బంతికే షెఫార్డ్ (0) రనౌట్ గా వెనుదిరగగా.. నాలుగో బంతికి ప్రమాదక జాసన్ హోల్డర్ (0)ను, చివరి బాల్ కు హెట్మైర్ (22)ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా.. మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. విండీస్ విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు అవసరం కాగా..కేవలం రెండే వికెట్లు మిగిలాయి.
తదుపరి ఓవర్ వేసిన ముఖేశ్ కుమార్.. మూడే పరుగులివ్వడంతో కరీబియన్లపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి కీలక దశలో హార్దిక్ పాండ్యా భారీ పొరపాటు చేశాడు.ఫుల్ జోష్ లో ఉన్న చాహల్ ను తప్పించి 18వ ఓవర్లో అర్ష్ దీప్ సింగ్ కు బంతి అప్పగించాడు. ఈ ఒక్క నిర్ణయం భారత్ ను పరాజయం వైపు నడిపింది. అప్పటి వరకు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు విండీస్ ప్లేయర్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించినా.. పాండ్యా తప్పుడు జడ్జిమెంట్ తో ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెట్టాడు. అర్ష్ దీప్ వేసిన 18వ ఓవర్లో 8 పరుగులు రాగా.. 19వ ఓవర్లో ముఖేశ్ 13 పరుగులు ఇచ్చాడు. అప్పటికే తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన పాండ్యా.. చివరి ఓవర్ వేసేందుకు మరో పేసర్ లేకుండా చేయడం విమర్శలకు తావిస్తోంది.
పెద్దగా బ్యాటింగ్ అనుభవం లేని అకీల్ హుసేన్, అల్జారీ జోసెఫ్ లపై స్పిన్ మంత్రాన్ని ప్రయోగించాల్సింది పోయి.. పేసర్లకు బంతినివ్వడంతో వాళ్లు ధాటిగా ఆడి గెలవాల్సిన మ్యాచ్ ను లాగేసుకున్నారు.అంతకుముందు పవర్ ప్లే లోనూ పాండ్యా తప్పుడు నిర్ణయాల వల్లే కరీబియన్లకు గట్టి పునాది లబించింది. తొలి ఓవర్ లోనే విండీస్ రెండు వికెట్లు కోల్పోగా.. నాలుగు ఓవర్లు ముగిసే సరికి మరో వికెట్ కూడా పడింది. ఇంకేముంది విండీస్ ఖేల్ ఖతం అనుకుంటే.. పవర్ ప్లే లో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు బంతినివ్వడంతో విండీస్ ప్లేయర్లు చెడుగుడాడుకున్నారు.
ఇలాంటి తలతిక్క డెసిషన్స్ తో భారత ఓటమికి ప్రధాన కారకుడైన పాండ్యాపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో విండీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.