డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తం భారత బ్యాటింగ్ యూనిట్ ఫెయిలైంది. అజింక్యా రహానె తప్పె ఎవరూ పెద్దగా రాణించలేదు. ఈ ఓటమి నేపథ్యంలో ఒక మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ ఫెయిలైనా సెలెక్టర్లు మాత్రం ఛటేశ్వర్ పుజారానే బలి చేస్తున్నారని చెప్పాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్ల్యూటీసీ ఫస్ట్ ఫైనల్లో ఓడినా టీమిండియా అభిమానులు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ వరుసగా రెండోసారి కప్ను చేజార్చుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. దీంతో భారత టీమ్ మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో ఆడబోయే సిరీస్లో భారత జట్టులో పలుమార్పులు చేసింది. టెస్టుల్లో జట్టుకు కీలక బ్యాటర్ అయిన ఛటేశ్వర్ పుజారాను పక్కన పెట్టింది. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్కు ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఎలాగైనా రీఎంట్రీ ఇవ్వాలనే కసిలో ఉన్న పుజారా.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో భారీ స్కోర్లు చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే భారత టీమ్ సెలెక్షన్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
విండీస్ సిరీస్కు వెళ్లనున్న భారత జట్టులో పుజారాకు చోటు కల్పించకపోవడంపై గవాస్కర్ సీరియస్ అయ్యాడు. ఎప్పుడూ పుజారానే ఎందుకు బలిపశువును చేస్తారని ప్రశ్నించాడు. ‘పుజారా ఒక్కడ్నే ఎందుకు తీసేశారు. మన టీమ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్కు అతడ్నే ఎందుకు బలి చేస్తున్నారు? భారత్ క్రికెట్కు పుజారా ఎంతో సేవ చేశాడు. కానీ అతడికి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు లేరు. అతడ్ని తీసేస్తే నెట్టింట హంగామా చేసేవాళ్లు లేరు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అజింక్యా రహానేను మినహాయిస్తే అందరూ విఫలమయ్యారు. అయినా పుజారా ఒక్కడ్నే తీసేసి.. మిగతావాళ్లను ఎలా కొనసాగిస్తారు? దీనికి సెలెక్టర్లు సమాధానం చెప్పాల్సిందే’ అని గవాస్కర్ స్పష్టం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అంతా ఫెయిలైనా.. పుజారాను మాత్రమే తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.