పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం ఉన్న గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో వన్డేల్లో నంబర్ వన్గా, టెస్టుల్లో నం.3గా, టీ20ల్లో నం.4గా ఉన్నాడు. ఈ ర్యాంకింగ్స్ను బట్టి అతను ఎంత మంచి ఆటగాడో చెప్పొచ్చు. అయితే.. ర్యాంకింగ్స్ పరంగా టాప్లోనే ఉన్న బాబర్ అజమ్ను తన సొంత దేశ క్రికెట్ అభిమానులే హేళన చేస్తున్నారు. బాబర్ అజమ్ టాప్ బ్యాటర్గా మారేందుకు జింబాబ్వేనే కారణమని అంటున్నారు. జింబాబ్వే లాంటి చిన్న జట్లపై సెంచరీలతో చెలరేగి.. కాస్త పటిష్టమైన టీమ్ ఎదురుపడగానే తేలిపోతాడనే విమర్శలు బాబర్పై ఉన్నాయి. అందుకే బాబర్ అజమ్ను.. కొంతమంది క్రికెట్ అభిమానులు జింబాబర్ అంటూ ట్రోల్ చేస్తుంటారు.
ఈ మధ్య ఆ ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. పాక్-ఇంగ్లండ్ రెండో టెస్టు సందర్భంగా ముల్తాన్ స్టేడియంలో బాబర్ అవమానం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టులు సైతం ముగిశాయి. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తమ బ్రాండ్ గేమ్, అగ్రెసివ్ అప్రోచ్తో పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు పాకిస్థాన్లో పర్యటించిన ఇంగ్లండ్.. 7 టీ20ల సిరీస్ను 4-3తో గెలిచింది. ఇప్పుడు మూడు టెస్టుల సిరీస్ను మరో టెస్టు మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక మిగిలిన ఆ ఒక్క టెస్టు సైతం గెలిచి పాక్ను క్లీన్ స్వీప్ చేయాలని బెన్ స్టోక్స్ సేన భావిస్తోంది. అయితే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో సెంచరీ చేసిన బాబర్ అజమ్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు.
అయితే.. రెండో టెస్టులో నిజానికి పాకిస్థాన్ గెలవాల్సింది. మ్యాచ్ నాలుగో రోజే ముగిసినా.. పాక్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో, నాలుగో రోజు ఉదయం వరకు పాక్కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. 354 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. గెలుపు ముంగిట బోల్తా పడింది. కేవలం 26 పరుగుల తేడాతో ఓడి.. మ్యాచ్తో పాటు సిరీస్ను చేజార్చుకుంది. అయితే.. కీలకమైన రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ బాబర్ అజమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. బాబర్ అవుటై పెవిలియన్కు వెళ్తున్న సమయంలో ముల్తాన్ స్టేడియంలోని పాక్ క్రికెట్ అభిమానులు జింబాబర్.. జింబాబర్ అంటూ గోలగోల చేశారు.
జింబాబ్వే లాంటి చిన్న టీమ్స్పై చెలరేగే బాబర్.. కీలకమైన మ్యాచ్ల్లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడనేది వారి ఆవేదన. అయితే.. బాబర్ను.. పాక్ ఫ్యాన్సే జింబాబర్ అంటూ స్టేడియంలోనే ట్రోల్ చేయడం వైరల్గా మారింది. తన దేశపు అభిమానులే తనను ఇలా అవమానించడంపై బాబర్ కాస్త నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘అభినందనలు మన తలకెక్కనివ్వద్దు.. అలాగే విమర్శలను మనసుకు తాకనివ్వద్దు’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే.. జింబాబర్ కామెంట్స్కే బాబర్ హర్ట్ అయి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. మరి పాక్ అభిమానుల జింబాబర్ ట్రోల్పై, బాబర్ చేసిన ఎమోషనల్ కొటేషన్ ట్వీట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Do not let compliments go to your head and criticism to your heart. pic.twitter.com/XqiIW3ScWN
— Babar Azam (@babarazam258) December 13, 2022