విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత శనివారం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కోహ్లీ నిర్ణయంతో క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ అయింది. కొంతమంది కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. కెప్టెన్గా అతను సాధించిన విజయాలు, రికార్డుల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. అలాగే కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా అనుష్క తీవ్ర ఉద్వేగానికి గురైనట్లు అర్థం అవుతోంది.
2014లో అప్పటి కెప్టెన్ ధోని టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడంతో తాను కెప్టెన్సీ చేస్తున్నట్టు కోహ్లీ తనతో చెప్పిన విషయం బాగా గుర్తుందని అనుష్క పేర్కొంది. ఆ రోజు తర్వాత కోహ్లీ, ధోని తాను కలిసి మాట్లాడుకున్న విషయాన్ని అనుష్క శర్మ గుర్తు చేసుకుంది. అప్పుడు కెప్టెన్గా ప్రమోషన్ పొందిన కోహ్లీ గడ్డం ఎంత త్వరగా నెరిసి పోతుందోనని ధోని సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలిపింది. దీంతో తామంతా బాగా నవ్వుకున్నట్లు చెప్పింది. అయితే ఆ రోజు నుంచి నేటి వరకు విరాట్ కోహ్లీ గడ్డం నెరిసి పోవడమే కాకుండా చాలానే చూశానని చెప్పుకొచ్చింది. ”ఆ తర్వాత తనలోని వృద్ధిని చూశాను. నీ అపారమైన అభివృద్ధితో పాటు నీ చుట్టు, నీ లోపల నీవు ఎదిగిన వృద్ధిని చూశాను. టీమిండియా కెప్టెన్గా నీలోని ఎదుగుదల, నీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాల పట్ల నేను గర్వపడుతున్నాను. అంతేకాకుండా నీలో నువ్వు ఎదిగిన తీరును చూసి నేను మరింత గర్వపడుతున్నాను. 2014లో మేము చాలా యంగ్గా, అమాయకంగా ఉన్నాం. మాలో కేవలం మంచి ఉద్దేశాలు మాత్రమే ఉండేవి. పాజిటివ్ ఆలోచనలతో మాత్రమే జీవితంలో ముందుకు వెళ్లొచ్చని నమ్మాం. మీరు ఎదుర్కొన్న సవాళ్లు గ్రౌండ్లో మాత్రమే ఉండేవి కావు. అయితే ఈ సవాళ్లు జీవితంలో మిమ్మిల్ని పరీక్షిస్తాయి” అని అనుష్క భావోద్వేగంతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది.
అంతేకాకుండా విరాట్ కోహ్లీతో తన ప్రేమ, మంచి ఉద్దేశాల పట్ల తాను గర్వపడుతున్నట్లు అనుష్క శర్మ తెలిపింది. కోహ్లీ మంచి కెప్టెన్సీ చేశాడని కొనియాడిన అనుష్క, ఫీల్డ్లో అన్నీ గెలిచాడని చెప్పుకొచ్చింది. అయితే కొన్ని నష్టాల తర్వాత కోహ్లీ కంట్లో కన్నీళ్లు ఉండగా ఆ సమయంలో తాను కోహ్లీ పక్కనే ఉన్నానని గుర్తుచేసుకుంది. విరాట్ కోహ్లీ అసాధారణ వ్యక్తిగా, సూటిగా ఉంటాడని ఇప్పటికీ జట్టు కోసం ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తున్నాడని పేర్కొంది. అదే విధంగా ఇదే విషయాన్ని కోహ్లీ ప్రతి ఒక్కరి నుంచి ఆశిస్తాడని అనుష్క చెప్పింది. కోహ్లీ సూటిగే ఉండే విధానమే అతని శత్రువు అని పేర్కొన్న అనుష్క శర్మ.. అదే తనలో, విరాట్ అభిమానుల మనసులో కోహ్లీని గొప్ప వాడిగా ఉంచుతుదని చెప్పింది. ఎందుకంటే దాని వెనుక కల్తీ లేని మంచి ఉద్దేశాలు ఉంటాయని, దానిని అందరూ అర్థం చేసుకుంటారని అనుష్క శర్మ ఆశించింది. అదే విధంగా కోహ్లీని అర్థం చేసుకున్న వాళ్లు నిజంగా ధన్యులు అని పేర్కొంది. కోహ్లీ తన లోపాలను ఎప్పుడూ దాచుకోడని, అదే విధంగా దురాశతో దేనిని కావాలనుకోడని చెప్పింది. ఇక తమ ప్రేమ అపరిమితం అని చెప్పిన అనుష్క శర్మ.. ఏడేళ్లుగా క్రికెట్లో విరాట్ కోహ్లీ నేర్చుకుంటూ ఉండడాన్ని తమ కూతురు చూస్తుందని పేర్కొంది. ఇలా అనుష్క శర్మ.. కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. మరి అనుష్కశర్మ పోస్టుపై, చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ చుట్టూ బయటకి కనిపించని కుట్ర! వారే టార్గెట్ చేశారా?