రఘురామ కృష్ణరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై న్యాయస్థానాలు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రఘురామ మెడికల్ రిపోర్ట్స్ కోర్టుకి అందకుండానే.., లీగల్ ప్రొసీజర్స్ జరగకుండానే ఆయన్ని గుంటూరు జైలుకు ఎలా తరలించారని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. దీనితో.. రఘురామ కృష్ణరాజుకి ఆర్మీ హాస్పిటల్ లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్స్ సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి చేరాయి. ప్రభుత్వ హాస్పిటల్ ఇచ్చిన నివేదిక, ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన నివేదిక మ్యాచ్ అయ్యిందా? లేదా? ఈ కేసు ఇప్పుడు ఎలాంటి మలుపు తీసుకోబోతుందన్న టెన్షన్ అందరిలోనూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే రఘురామ కుటుంబం హస్తిన చేరి అక్కడ చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో పలు కేంద్ర మంత్రులను కలుస్తున్న రఘురామరాజు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రఘురామరాజు కుమారుడు భరత్, సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసారు.
కస్టడీలో ఉన్న తన తండ్రిని సిఐడి అధికారులు కొట్టడంపై, సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని.. దర్యాప్తుని సిబిఐ లేదా, సుప్రీం కోర్టు నిర్ణయించే ప్రత్యేక బృందంతో ఈ దర్యాప్తు జరపించాలని భరత్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఇందులో ప్రతి వాదులుగా జగన్ మోహన్ రెడ్డిని సిఐడి అధికారులను కూడా చేర్చారు. ఈ దర్యాప్తులో దోషులుగా తేలితే వారి అందరి పై కూడా కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కూడా ఈ పిటీషన్లో పేర్కొన్నారు. వినీత్ శరణ్, బీఆర్ గగాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటీషన్ విచారణకు స్వీకరించడం విశేషం. దీనితో ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్.. గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ కు మ్యాచ్ కాకపోతే ఈ కేసులో సిబిఐ రంగ ప్రవేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే వైసీపీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. రఘురామ కుటుంభ సభ్యులు ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాద్ సింగ్, పార్లమెంట్ స్పీకర్ ని కలిసి.. రఘురామరాజు అరెస్ట్ తదినంతర పరిణామాలు వివరించారు. నిజానికి ఢిల్లీ పెద్దలు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే రఘురామ ఫ్యామిలీ సుప్రీంలో ఈ పిటీషన్ వేసినట్టు తెలుస్తోంది. మరి రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.