వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా స్వయంగా డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు. పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుమారు ఏడు వందల మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పులు, దుస్తులు, గజ్జెలు తదితర వస్తువులను ఎమ్మెల్యే రోజా స్వయంగా అందచేశారు.
నగిరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఏం చేసినా సంచలనమే. లాక్ డౌన్ సమయం లో కరోనా మహమ్మారి కట్టడికి విధులు నిర్వర్తించిన వారికి స్వయంగా వంట చేసి పెట్టిన రోజా ఏది చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో అంబులెన్సు నడిపిన రోజా, ఆ తర్వాత దిశ స్కూటర్లను నడిపి సందడి చేశారు. ఈ సంరద్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు.
ఇప్పుడు తాజాగా డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ ఎమ్మెల్యే రోజా అందరినీ ఆకట్టుకున్నారు. నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.