తాండూర్- ప్రజా ప్రతినిధులు ఎంత హూందాగా ఉంటే అంతగా ప్రజలు ఆదరిస్తారు. ఓట్లు వేసిన ప్రజలు కోప్పడినా ఓపికతో భరించాలి కానీ, వారిపై తమ ప్రతాపం చూపితే మాత్రం ప్రజా ప్రతినిధుల భవిష్యత్తుకు మంగళం పాడినట్టే. మొన్నా మధ్య తెలంగాణలోని తాండూర్ మునిసిపల్ చైర్ పర్సన్ తాడికొండ స్వప్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసి దొరికిపోయిన సంగతి తెలుసు కదా. ఇదిగో ఇప్పడు ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
అసలేం జరిగిందంటే.. తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోమారు నోరుజారి వివాదంలో చిక్కుకుంది. ఆమె భర్త భూకబ్జాలకు పాల్పడటంతో, ఓ మహిళ ఆమెను ప్రశ్నించింది. దీంతో సదరు మహిళతో పాటు స్థానికులపై తాటికొండ స్వప్న తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మరోసారి తనను ఇటువంటివాటిపై అడిగితే చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే సైతం ఉండటం ఆసక్తికరంగా మారింది.
తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన గల్లీ గల్లీకి పైలెట్ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా 13 వ వార్డు పర్యటనకు వెళ్లారు. వార్డు పర్యటనలో స్థానికులు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న భర్త పరిమల్ గుప్తాపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. కష్టపడి దాచుకున్న సొమ్ముతో కొనుక్కున్న స్థలాలను చైర్ పర్సన్ భర్త పరిమల్ కొందరు వ్యక్తులతో కలసి కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వారంతా ఫిర్యాదు చేశారు.
ఇంకేముంది ఆ సమయంలో అక్కడే ఉన్న మునిసిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్ప ఆగ్రహంతో రగిలిపోయింది. నా భర్తపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారా, మళ్లీ ఇలాంటిది రిపీట్ అయ్యిందంటే చెప్పుతో కొడతానంటూ స్థానికులపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. చైర్ పర్సన్ తాటికొండ స్వప్న ఘాటు వ్యాఖ్యలతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో సహా, అధికారులు, ప్రజా ప్రతినిధులంతా అవాక్కయ్యారు. ఓట్లేసిన ప్రజలపై అలాంటి బాష వాడటం సరికాదని, క్షమాపణ చెప్పాలని స్థానికులు నిరసనకు దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది,